Hyderabad: వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
ABN , First Publish Date - 2021-10-27T17:14:32+05:30 IST
వృద్ధ దంపతులను హత్యచేసిన కేసులోని నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించిందని నార్సింగ్ పోలీసులు మంగళవారం తెలిపారు. హైదర్షాకోట్లో 2014లో జరిగిన ఈ ఘటన
హైదరాబాద్/నార్సింగ్: వృద్ధ దంపతులను హత్యచేసిన కేసులోని నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించిందని నార్సింగ్ పోలీసులు మంగళవారం తెలిపారు. హైదర్షాకోట్లో 2014లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం అన్న విషయం విదితమే. హైదర్షాకోట్ గ్రామ సాయి హర్ష్షాకాలనీలో వేదాల సిం హాద్రి(62), వేదాల సులోచన(60) అనే భార్యభర్తలు ఉండేవారు. కుమారుడు బెంగుళూర్లోనూ, కూతురు బంధువుల ఇంట్లోలోనూ ఉండేది. ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు కావడంతో రాకపోకలకు అధికంగా ఆటోలను ఆశ్రయించేవారు. సులోచన రిటైర్డ్ అయిన మొయినాబాద్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పూర్వవిద్యార్థి అయినటువంటి ఆటో డ్రైవర్ మహ్మద్ ఫహీముద్దిన్ (40) సులోచన టీచర్ను మెహిదీపట్నంలో గుర్తుపట్టి పరిచయం చేసుకున్నాడు. ఆమెను ఇంటిలో దింపి భర్తతోనూ మాట్లాడాడు. వీరితో ఉన్న పరిచయం కాస్తా వక్రబుద్ధికి దారితీసింది.
వారిద్దరే ఉంటారని తెలుసుకొని 2014 నవంబరు 6న హత్య చేసి, ఇంటిలోని బంగారపు గొలుసు, నాలుగు బంగారపు గాజులు, రెండు సెల్ఫోన్లు, బంగారపు ఉంగరంతో అక్కడి నుంచి ఊడాయించాడు. మరుసటి రోజే మొయినాబాద్లో నిందితుడిని నార్సింగ్ పోలీసులు పట్టుకుని, రిమాండ్కు తరలించారు. ఆరో అడిషనల్ కోర్టు ఎల్ బీనగర్ న్యాయమూర్తి కేసు విచారించి, జీవిత ఖైదు విధించారని నార్సింగ్ పోలీసులు తెలిపారు.