హుజురాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే: Etela rajendar
ABN , First Publish Date - 2021-11-10T19:21:27+05:30 IST
హుజురాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే అని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
హైదరాబాద్: హుజురాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే అని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణాస్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ తీర్పుతో కేసీఆర్కు దిమ్మతిరిగిపోయిందన్నారు. కేసీఆర్కు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని...ఆయన మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. తనను ఓడించేందుకు హుజురాబాద్లో రూ.600 కోట్లు ఖర్చుపెట్టారని అన్నారు. ఉద్యమ ద్రోహులకు పదవులిచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.
ఉద్యమకారులు కేసీఆర్ను వదిలి బయటకు రావాలని పిలుపునిచ్చారు. 8 ఏళ్లుగా వరి ధాన్యం కొన్నదెవరో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ధర్నా చౌక్ అవసరమేంటో కేసీఆర్కు ఇప్పుడు తెలిసొచ్చిందని అన్నారు. ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్.. ఇప్పుడు అక్కడే ధర్నా చేస్తానంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. మిల్లింగ్ టెక్నాలజీని పెంచుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. కేసీఆర్కు ప్రజలపై ప్రేముంటే పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని ఈటల డిమాండ్ చేశారు.