HYD : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లి.. ఘోరం..!
ABN , First Publish Date - 2021-08-28T16:18:41+05:30 IST
ప్రేమించి, గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఇరు పక్షాల పెద్దలు కాదనడంతో నగరానికి వచ్చి...
- ప్రసూతి ఆస్పత్రిలో వదిలి వెళ్లిన భర్త
- పట్టించుకోని కుటుంబ సభ్యులు
- అండగా నిలిచిన పోలీసులు
హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్ : భర్త ప్రసూతి ఆస్పత్రిలో వదిలి వెళ్లాడు. ప్రేమించి పెళ్లాడటంతో కన్నవారు కాదన్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చినా ఆదరించే వారు లేకపోవడంతో, ఆమెకు సుల్తాన్బజార్ పోలీసులు అండగా నిలిచారు. రంగారెడ్డి జిల్లా అత్నూర్ మండలం మాధవరానికి చెందిన ఎం. ప్రియాంక, అదే మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ప్రేమించి, గతేడాది పెళ్లి చేసుకున్నారు. ఇరు పక్షాల పెద్దలు కాదనడంతో నగరానికి వచ్చి ఉప్పల్ చిలుకానగర్లో కాపురం పెట్టారు. నెలలు నిండిన ప్రియాంకను భర్త శ్రీనివాస్ ఈ నెల 15న కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించాడు. 16న ప్రియాంక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
17వ తేదీ నుంచి శ్రీనివాస్ కనిపించకుండా పోయాడు. దీంతో ప్రియాంక తన పసిబిడ్డతో ఆస్పత్రిలోనే ఉండిపోయింది. భర్త కనిపించడం లేదంటూ సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి రెండు వైపులా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రియాంక తల్లి, అక్క మహేశ్వరీలు ఆస్పత్రికి వచ్చారు. శ్రీనివాస్ శ్రీశైలంలోని ఓ సత్రంలో ఉన్నట్లు ఈనెల 26 న గుర్తించి అక్కడికి వెళ్లి, శుక్రవారం నగరానికి తీసుకువచ్చారు. పుట్టింట్లో ఉన్న ప్రియాంకకు అప్పగించారు. కాగా మొక్కు తీర్చుకునేందుకు శ్రీశైలం వెళ్లి అక్కడే సత్రంలో ఉండిపోయానని శ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. ప్రియాంక కేసులో స్పందించిన సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఎస్ఐ శ్రీకాంత్రెడ్డిని, డీసీపీ రమే్షరెడ్డి, ఏసీపీ దేవేందర్ అభినందించారు.