గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ... భాగ్యనగర బంధం!
ABN , First Publish Date - 2021-12-16T03:01:50+05:30 IST
గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్! ధైర్యానికే ఆయన దన్ను. సాహసానికి ఆయన నిటారైన వెన్ను. పోరాటమే ఊపిరిగా తుదిశ్వాస దాకా జీవించిన....

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్! ధైర్యానికే ఆయన దన్ను. సాహసానికి ఆయన నిటారైన వెన్ను. పోరాటమే ఊపిరిగా తుదిశ్వాస దాకా జీవించిన అమరుడు వరుణ్.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో గాయాలతో బయటపడిన Indian Air Force గ్రూప్ కెప్టెన్ వరుణ్ ఈ రోజు (బుధవారం) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ఆయన స్వరాష్ట్రం. విధి నిర్వహణలో దేశం నలుమూలలూ పని చేశారు. ఇప్పుడు ఆసేతుహిమచలం ప్రజల గుండెల్లో అమరుడై నిలిచిపోయిన వరుణ్కి హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం.
భారత వైమానిక దళంలో చేరిన యువదళం- ఇంజనీర్లయినా, పైలట్లయినా - మొదట శిక్షణ పొందేది- ఎయిర్ ఫోర్స్ అకాడమి (ఎఎఫ్ఎ) - దిండిగల్ కాబట్టి, వరుణ్కి హైదరాబాద్తో అది తొలి అనుబంధం. ఇంటర్మీడియెట్ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమి (ఎన్డిఎ)కి ఎంపికయ్యి, ఆఫీసర్ క్యాడెట్గా ఉత్తీర్ణుడయ్యాక వరుణ్ మొట్టమొదట అడుగుపెట్టింది హైదరాబాదులో. ఫైటర్ పైలెట్ కావడం వల్ల హకింపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఆ తర్వాత ఆయన శిక్షణ పొందారు. అలా జంట నగరాలతో తొలి అనుబంధం తర్వాత ఆయన పలు చోట్ల పనిచేశారు.
ఫ్లైట్ లెఫ్టినెంట్ కావడమే కాకుండా, ఒక ప్రత్యేకమైన కోర్స్ చేసి ఫ్లయ్యింగ్ ఇన్స్ట్రక్టర్ అయ్యారు. 2007- 09 మధ్య గోరఖ్పూర్ ఏఐఎఫ్ బేస్లో పనిచేశాక, ఆయనని ఫ్లయ్యింగ్ ఇన్స్ట్రక్టర్గా 2009లో హకింపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్కి బదిలీ చేశారు. ఎక్కడ ఆయన తొలినాళ్ల శిక్షణ పొందారో, అక్కడకే ఆయన శిక్షకుడిగా వచ్చారు. అలా హైదరాబాద్తో ఆయనకి మళ్లీ అనుబంధం ఏర్పడింది.