నేడే గ్రేటర్ గెజిట్..!
ABN , First Publish Date - 2021-01-16T06:57:19+05:30 IST
గ్రేటర్ నూతన పాలకమండలి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.
గెలిచిన కార్పొరేటర్ల పేర్లతో ప్రకటన
నెల రోజుల్లో పాలకమండలి ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ నూతన పాలకమండలి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన సభ్యుల పేర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు గెజిట్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. 4న ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. రాజ్యాంగం, జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఆ తర్వాతే కొత్త పాలకమండలి కొలువుదీరే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఎన్నికల సంఘం కొత్త కార్పొరేటర్ల పేర్లతో గెజిట్ ప్రకటిస్తుంది. గెజిట్ విడుదల అనంతరం నెల రోజుల్లోపు గెలిచిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠం దక్కించుకుంటాయా, లేక తమ బలంతోనే అధికార పార్టీ బల్దియా పీఠంపై కూర్చుంటుందా, అన్నది చర్చనీయాంశంగా మారింది. నేడు గెజిట్ ప్రకటించిన పక్షంలో ఫిబ్రవరి 15వ తేదీలోపు కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే అవకాశముంది. సోమవారం గెజిట్ ప్రకటించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.