Gokul.. ట్రాఫిక్ ట్రబుల్ డబుల్.. దాటేందుకే 45 నిమిషాలు..!
ABN , First Publish Date - 2021-12-22T15:40:54+05:30 IST
Gokul.. ట్రాఫిక్ ట్రబుల్ డబుల్.. దాటేందుకే 45 నిమిషాలు..!
- లింకు రోడ్డు కనెక్టివిటీతో పెరిగిన కష్టాలు
- ఆ చౌరస్తాలో వాహనదారుల అవస్థలు వర్ణణాతీతం
- సిగ్నళ్లు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కరువు
హైదరాబాద్ సిటీ/కేపీహెచ్బీకాలనీ : నగరంలోని కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల నుంచి మాదాపూర్, హైటెక్సిటీ రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే గోకుల్ ప్లాట్స్ చౌరస్తా మీదుగా వెళ్లాల్సిందే. జాతీయ రహదారికి వెళ్లేందుకు ఆ చౌరస్తా మీదుగా హైవేకు లింక్ రోడ్డును అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచీ ట్రాఫిక్ జామ్ పెరిగింది. గోకుల్ చౌరస్తాను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుండడం, అందుకనుగుణంగా అధికారులు ప్రత్యామ్నాయాలు చూపకపోవడంతో నిత్యం ట్రాఫిక్ జాంఝాటంలో చిక్కుకుని వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. చౌరస్తా దాటేందుకు గతంలో ఐదు నిమిషాల సమయానికి గాను ప్రస్తుతం 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతోందంటే.. ట్రాఫిక్జామ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
తక్షణమే సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి..
వెంకటరమణ కాలనీ, గోకుల్ ప్లాట్స్ చౌరస్తాలో సాధ్యమైనంత త్వరగా సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. నాలుగు రోడ్లలో నలుగురు కానిస్టేబుళ్లను నియమించాలని స్థానికులు కోరుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆ మార్గంలో కార్లు, ఆటోల మధ్యలో ఇరుక్కుపోయి బయటపడేందుకు నానా అవస్థలూ పడుతున్నామని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు.
కిలోమీటర్ల కొద్దీ బారులు
ఆ చౌరస్తాలో నలువైపులా కూడా వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్కు కూడా దారి దొరకడం లేదు. కేపీహెచ్బీ ఆరు, తొమ్మిది ఫేజ్లు, వసంతనగర్, ప్రజయ్, గోకుల్ ప్లాట్స్, గోపాల్నగర్ పరిసర ప్రాంతాల వాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు. స్కూల్స్, కాలేజీలు, కార్యాలయాల ప్రారంభం, మూసివేత సమయంలో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు, వాహనాల రాకపోకలు పెరిగిన గోకుల్ చౌరస్తాను మరింత విస్తరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చౌరస్తాలో కనీసం ట్రాఫిక్ కానిస్టేబుల్ అయినా లేకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.