జీహెచ్‌ఎంసీ లాక్‌డౌన్‌ మార్గదర్శకాలివీ...

ABN , First Publish Date - 2021-05-13T18:23:05+05:30 IST

లాక్‌డౌన్‌ అమలుతో పాటు మినహాయింపు వేళల్లో కొవిడ్‌ నిబంధనల..

జీహెచ్‌ఎంసీ లాక్‌డౌన్‌ మార్గదర్శకాలివీ...

  • ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ


హైదరాబాద్‌ సిటీ : లాక్‌డౌన్‌ అమలుతో పాటు మినహాయింపు వేళల్లో కొవిడ్‌ నిబంధనల పూర్తిస్థాయి అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఏ విభాగం ఏం చేయాలన్నది వివరిస్తూ పురపాలక శాఖ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు ఏం చేయాలన్నది పురపాలక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన అంశాలివి..


  • కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. 
  • కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలిసేలా చేయాలి. 
  • పారిశుధ్య నిర్వహణపై లాక్‌డౌన్‌ ప్రభావం ఉండకూడదు.
  • సిబ్బంది హాజరు ఉదయం తీసుకోవాలి. 
  • రాత్రి వేళల్లో పారిశుధ్య విధులు నిర్వహించే కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 
  • అత్యంత ప్రాధాన్యతగా పారిశుధ్యం, ప్రజారోగ్యానికి సంబంధించి నిర్వహణ చర్యలు చేపట్టాలి. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగించాలి. 
  • ఇంటింటి చెత్త సేకరణ, రవాణా మెరుగయ్యేలా చూడాలి.
  • కూరగాయల మార్కెట్లు, సంతలు, మాంసాహార దుకాణాలు, మిల్క్‌ బూత్‌ల వద్ద పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. 
  • బస్తీలు, మురికివాడలు, నిర్మాణ రంగ సైట్ల వద్ద కూలీలు ఉండే ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. వారికి అవసరమైన ఆహారం, నిత్యావసరాలు అందేలా చూడాలి. 
  • ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉండాలి. ఆ తర్వాత కొనసాగితే చర్యలు తీసుకోవాలి. 
  • ప్రతీ దుకాణం ముందు హ్యాండ్‌ శానిటైజర్‌ ఉండాలి. కొనుగోదారులు మాస్క్‌ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చూడాలి. ముఖ్యంగా వైన్స్‌, మెడికల్‌ షాపులపై ప్రత్యేక దృష్టి సారించాలి. 
  • ఎప్పటి నుంచి ఎప్పటి వరకు షాపు తెరిచి ఉంటుందనే సమయం సూచించే బోర్డులుండాలి. 
  • దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి సాధారణ పౌరులకు అనుమతి నిషిద్ధం. 
  • మతపరమైన సమవేశాలు నిర్వహించకూడదు. 
  • పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. గరిష్ఠంగా 40 మందికి మించి హాజరు కాకూడదు. 
  • మాస్క్‌లు, హ్యాండ్‌ శానిటైజేషన్‌,  భౌతిక దూరం వంటి కొవిడ్‌-19 నిబంధనలు కచ్చితంగా పాటించాలి. 
  • అనుమతి తీసుకోకున్నా, నిబంధనలు ఉల్లంఘించినా ఫంక్షన్‌ హాల్‌ యజమాని, కార్యక్రమ నిర్వాహకులు శిక్షార్హులు. 

కొవిడ్‌ మృతదేహాల దహనానికి :- 

  • కరోనా మొదటి దశ సమయంలో విడుదల చేసిన ప్రొటోకాల్‌ ప్రకారం కొవిడ్‌ మృతదేహాల దహనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. 
  • మృతుల కుటుంబీలకు ఇబ్బందులు పడకుండా శ్మశాన వాటిక వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
  • ఎవరైనా మరణిస్తే 20 కంటే ఎక్కువ మంది అక్కడ ఉండేందుకు అనుమతి లేదు. 
  • నిర్మాణ రంగ, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల పనులకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలి. కార్మికులు ఉన్న ప్రాంతాల్లో పనులు యథాతథంగా చేసుకోవచ్చు. 

  • 33 శాతం హాజరు.
  • కొవిడ్‌ సంబంధిత పనులు, సేవలతో సంబంధమున్న వారికి రోజూ హాజరు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి. 
  • కొవిడ్‌తో సంబంధం లేని విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది నిత్యం 33 శాతం మంది హాజరైతే చాలు. 
  • ప్రభుత్వ కార్యాలయాల ప్రవేశ ద్వారాల వద్ద హ్యాండ్‌ శానిటైజర్‌ ఏర్పాటు చేయాలి. 
  • అత్యసర సేవల కోసం వినియోగించుకునే సిబ్బందికి పాసులు/గుర్తింపు కార్డులివ్వాలి.

Updated Date - 2021-05-13T18:23:05+05:30 IST