కానరాని ‘నిఘా నేత్రాలు’
ABN , First Publish Date - 2021-03-26T06:45:40+05:30 IST
నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు ఇలా ఒక్కటి ఏంటీ అన్నింటికి ఫుల్స్టాఫ్ పెట్టాలంటే ఒక్కటే మార్గం... అదే సీసీ కెమెరా. అనుకోకుండా జరిగిన సంఘటనలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై నిజానిజాల నిర్ధారణలో, నిందితుల గుర్తింపులో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇదీ... బడంగ్పేట్ కార్పొరేషన్ దుస్థితి
సీసీ కెమెరాలపై దృష్టి పెట్టని పాలకవర్గం
మీర్పేట్లో ఐదేళ్ల క్రితమే ఏర్పాటు
సరూర్నగర్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు ఇలా ఒక్కటి ఏంటీ అన్నింటికి ఫుల్స్టాఫ్ పెట్టాలంటే ఒక్కటే మార్గం... అదే సీసీ కెమెరా. అనుకోకుండా జరిగిన సంఘటనలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై నిజానిజాల నిర్ధారణలో, నిందితుల గుర్తింపులో అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, పోలీసులు, ప్రజా ప్రతినిధుల సూచన మేరకు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, విద్యా, వ్యాపారా సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన నిఘా నేత్రాల ఏర్పాటు పట్ల బడంగ్పేట్ కార్పొరేషన్ అధికారులు, పాలకవర్గం ప్రతినిధులు దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఇక్కడి ప్రజాప్రతినిధులు కాలనీల్లో సీసీ కెమెరాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయా కార్యక్రమాల్లో సీసీ కెమెరాల గొప్పదనం గురించి ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరూ వాటిని ఏర్పాటు చేసుకోవాలంటూ సలహాలు సైతం ఇచ్చారు.
మరి బడంగ్పేట్లో ఏవీ..!
అందరికీ సలహాలు ఇచ్చే పాలకులు తమ సొంత కార్యాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటును మాత్రం మరిచారు. 32 డివిజన్లు కలిగి ఉన్న బడంగ్పేట్ కార్పొరేషన్ కార్యాలయానికి నిత్యం అనేక మంది వివిధ అవసరాల నిమిత్తం వస్తుంటారు. అనేక సందర్భాల్లో ఇక్కడ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు సైతం జరుగుతుంటాయి. వివిధ పనుల కోసం వచ్చే సందర్శకులు తమ పనులు కాకపోతే అధికారులపై విరుచుకుపడే సంఘటనలు సైతం ఉంటాయి. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు బాలాపూర్లోని ఓ అక్రమ వెంచర్లో కూల్చివేతలు చేపట్టగా, సదరు వెంచర్కు చెందిన కొందరు పహిల్వాన్లు తల్వార్లు పట్టుకుని కార్యాలయానికి వచ్చి గొడవకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అప్పట్లో సాక్షాత్తూ టౌన్ ప్లానింగ్ సెక్షన్లోనే ఓ ప్లానర్ సెక్షన్ సిబ్బందిపై దాడికి దిగిన సంఘటన సైతం విధితమే. ఆ వ్యవహారం అప్పట్లో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. ‘చెప్పేటందుకే నీతులు..’ అన్నట్టుగా ఇక్కడి అధికారులు, పాలకులు వ్యవహారం. ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి చెప్పి ప్రోత్సహిస్తున్న వారే, నిత్యం రద్దీగా ఉండే కార్యాలయాన్ని విస్మరిస్తున్నారు.
మీర్పేట్ను చూసైనా...
చెంతనే ఉన్న మీర్పేట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఐదేళ్ల క్రితమే అప్పటి కమిషనర్ వసంత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ భవనానికి నాలుగు వైపులా నాలుగు కెమెరాలు నిత్యం నిఘాలో ఉంటాయి. నిఘా నేత్రాల ఆవశ్యకతను గుర్తించి మీర్పేట్లో ఎప్పుడో ఏర్పాటు చేయగా, బడంగ్పేట్లో మాత్రం వాటి గురించి ఆలోచించిన దాఖలాలు కూడా లేకపోవడం గమనార్హం! మరి.. పాలకులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెడతారో లేదో వేచి చూడాల్సిందే!