HYD : గంజాయి ప్యాకెట్లు, మత్తు ట్యాబ్లెట్లతో.. కోర్టుకు వచ్చిన నిందితులు
ABN , First Publish Date - 2021-12-30T13:29:54+05:30 IST
ముగ్గురు నిందితులు ఏకంగా జేబులో గంజాయి ప్యాకెట్లు, మత్తు టాబ్లెట్స్ వేసుకొని..

- పోలీసులతో వాగ్వాదం
- ముగ్గురిపై కేసు
హైదరాబాద్/మంగళ్హాట్ : ముగ్గురు నిందితులు ఏకంగా జేబులో గంజాయి ప్యాకెట్లు, మత్తు టాబ్లెట్స్ వేసుకొని ఓ కేసు విచారణలో నాంపల్లి కోర్టుకు హాజరవడం నగరంలో కలకలం రేపింది. నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో గంజాయి విషయం వెలుగులోకి వచ్చింది. నాంపల్లి ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. షానవాజ్(29), ముజఫర్(30), షారూక్(29), అబ్బులు రెయిన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో ఆర్మ్స్ యాక్ట్లో అరెస్టయి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. నిందితుడు అబ్బుపై పలు కేసులు ఉండడంతో పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆర్మ్స్ యాక్ట్ కేసులో ఈ నలుగురిని బుధవారం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది. దాంతో పోలీసులు షానవాజ్, ముజఫర్, షారూక్లను కోర్టుకు రావాల్సిందిగా సమాచారం ఇచ్చారు.
పీడీయాక్ట్తో జైల్లో ఉన్న అబ్బును కానిస్టేబుల్ శివకుమార్ రెడ్డి, పవన్లు కోర్టు వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే కోర్టుకు వచ్చిన షానవాజ్, ముజఫర్, షారూక్లు పోలీస్ కస్టడీలో ఉన్న అబ్బును కలిసేందుకు కోర్టు ప్రాంగణంలోని పార్కింగ్ ప్రాంతంలో ప్రయత్నించారు. కానీ కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. ముగ్గురు నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానిస్టేబుల్ శివకుమార్రెడ్డి నాంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా షానవాజ్ జేబులో మూడు గ్రాముల గంజాయి, మత్తు ట్యాబ్లెట్ బయటపడింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ముగ్గురిపై మరో కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఖలీల్పాషా పేర్కొన్నారు.