హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు.. పండగపూట విషాదం

ABN , First Publish Date - 2021-11-05T13:57:13+05:30 IST

పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌కు చెందిన విష్ణు...

హైదరాబాద్ పాతబస్తీలో పేలుడు.. పండగపూట విషాదం
FILE PHOTO

హైదరాబాద్ సిటీ : నగరంలోని పాతబస్తీలో దీపావళి పూట పేలుడు జరిగింది. ఈ పేలుడు థాటికి ఘటనాస్థలిలో ఇద్దరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌కు చెందిన విష్ణు, జగన్, వరుణ్ అనే యువకులు హైదరాబాద్‌లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నగరంలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఉల్లాస గోపాల్ ముకిం, ఆకల్ప వారి గోడౌన్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తయారీ చేసి అమ్మకానికి పంపుతూ ఉంటారు. నిన్న దీపావళి కావడంతో విష్ణు, జగన్, వరుణ్‌లు కలిసి టపాకాయలు పేల్చారు. అవి పేలడంతో ఘటనాస్థలంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జగన్, విష్ణు అక్కడిక్కడే మృతి చెందగా.. వరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడ్ని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఉస్మానియా ఆస్పత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు.


సమాచారం అందుకున్న ఫలక్‌నమా, ఛత్రినాక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. మజీద్ విగ్రహాల తయారీ గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగిందని.. అందులో ఐదుగురు పనిచేస్తుంటారన్నారు. వీరిలో ముగ్గురు పేలుడు పదార్థాలు పెట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని.. మరొకరు గాయాలపాలై ఉస్మానియాలో చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. దీపావళి రోజున హైదరాబాద్‌లో సుమారు 20 మందికి పైగానే పటాసులు పేలుస్తూ గాయపడ్డారు. అయితే గతేడాదితో పోలిస్తే ప్రమాదాలు చాలా తక్కువగానే జరిగాయని చెప్పుకోవచ్చు.

Updated Date - 2021-11-05T13:57:13+05:30 IST