ట్రూప్ బజార్లో అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2021-02-06T06:24:07+05:30 IST
నిత్యం రద్దీగా ఉండే ట్రూప్ బజార్లో భారీ అగ్ని ప్రమాదం

ట్రాఫిక్ మళ్లింపు
మంగళ్హాట్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి) : నిత్యం రద్దీగా ఉండే ట్రూప్ బజార్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో వ్యాపారులు భయాందోళనతో షాపులను మూసివేశారు. శానిటరీ దుకాణం గోదాంలో నిప్పంటుకుని మొదటి, రెండో అంతస్తుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 8.40 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రూప్బజార్ మార్కెట్లో నవీన్ ఎంటర్ప్రైజెస్ పై అంతస్తులోని డీకే శానిటరీ గోదాంలో మంటలు చెలరేగి క్షణాల్లో వ్యాపించాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే సుల్తాన్బజార్ పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్లను రప్పించి దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. గోదాం ఉన్న భవనంలో మరిన్ని శానిటరీ షాపులు, భవనానికి ఆనుకొని పెద్ద ఎత్తున ఎలక్ర్టికల్ షాపులు ఉండడంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. షాపులను మూసి వేసి రోడ్లపైకి వచ్చారు. విద్యుత్ అంతరాయం కారణంగా అధికారులు, సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా అఫ్జల్గంజ్ నుంచి ట్రూప్ బజార్ వైపు వచ్చే వాహనాలను పోలీసులు ఆబిడ్స్ వైపు మళ్లించారు.