అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు
ABN , First Publish Date - 2021-02-05T06:28:23+05:30 IST
బాలికపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది.
![అత్యాచారానికి యత్నించిన వ్యక్తికి 10 ఏళ్ల జైలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బేగంపేట, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): బాలికపై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. బేగంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓ బస్తీలో తల్లి, కుమార్తె నివసిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన యాదయ్య(52) 2019, నవంబర్లో వారి ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టపక్కల వారు వచ్చి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో యాదయ్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలతో కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. కేసు విచారించిన మొదటి మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి కె.సునీత నిందితుడికి 10 ఏళ్ల, రూ.5వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు.
బస్సు అద్దాలు ధ్వంసం చేసిన కేసులో...
సైదాబాద్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ను దుర్బాషలాడుతూ బస్సు అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఓ యువకుడికి ఏడాది జైలు, రూ.800 జరిమానా విధిస్తూ నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్ తీర్పునిచ్చారు. చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం.. 2016, ఏప్రిల్ 3న రాత్రి 9.50 సమయంలో ఆర్టీసీ బస్సు దేవరకొండ నుంచి ఎంజీబీఎస్ వెళ్తోంది. మలక్పేట యశోద ఆస్పత్రి వద్ద బైక్పై వచ్చిన సైదాబాద్కు చెందిన వాజీద్ బీన్ ఇస్లా(27) బస్సును అడ్డుకున్నాడు. డ్రైవర్ వెంకటయ్యను దుర్బాలాడుతూ రాయితో బస్సు ముందు అద్దం ధ్వంసం చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ గురువారం తీర్పునిచ్చినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.