HYD: భారీ వర్షాలపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ సమీక్ష
ABN , First Publish Date - 2021-09-07T17:51:03+05:30 IST
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్ సోమేష్కుమార్తో మాట్లాడిన ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్, రోడ్లు, నాలాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్ సిబ్బందిని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలని తెలిపారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.