HYD : పదేళ్ల క్రితం భర్త మృతి.. తమ్ముడితో కలిసి ఉంటున్న అక్క.. అసభ్యంగా ప్రవర్తించిన బావ.. విసిగిపోయి.. చివరికి..!
ABN , First Publish Date - 2021-12-07T16:55:49+05:30 IST
పదేళ్ల క్రితం భర్త మృతి.. తమ్ముడితో కలిసి ఉంటున్న అక్క.. అసభ్యంగా ప్రవర్తించిన బావ.. విసిగిపోయి.. చివరికి..!
హైదరాబాద్ సిటీ/సరూర్నగర్ : తాగి వచ్చి మరదలిని వేధిస్తున్న బావను.. మరదలు, బావమరిదితో కలిసి హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను మీర్పేట్ పోలీసులు సోమవారం ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ మద్ది మహేందర్రెడ్డి వివరాల ప్రకారం.. చంపాపేట్లోని కృష్ణానగర్కు చెందిన కొడావత్ రెడ్యా(45)కు ఉప్పుగూడకు చెందిన లక్ష్మి భార్యాభర్తలు. లక్ష్మికి చెల్లెలు సరోజ, తమ్ముడు శ్రీను ఉన్నారు. సరోజకు సైతం వివాహం కాగా, పదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో జిల్లెలగూడలోని సత్యసాయినగర్ కాలనీలో తమ్ముడు శ్రీనుతో కలిసి ఉంటోంది. వారందరూ టైల్స్ పని చేస్తుంటారు. కొంత కాలంగా రెడ్యా మద్యం తాగి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఎవరితో మాట్లాడినా మరదలిపై విరుచుకుపడేవాడు. ఈ నెల 2న సరోజ ఇంటికి వెళ్లి అదేవిధంగా ప్రవర్తించాడు. విసిగిపోయిన సరోజ.. తమ్ముడు శ్రీనుతో కలిసి అప్పడాల కర్రతో తీవ్రంగా కొట్టారు.
రెడ్యా తలకు రక్తం రావడంతో పసుపు రాసి పడుకోబెట్టారు. రాత్రంతా రక్త స్రావం కావడంతో తెల్లారేసరికి రెడ్యా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స సరిగా అందడంలేదని హస్తినాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. తన తండ్రి మృతిపై అనుమానం ఉందంటూ రెడ్యా కుమారుడు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఆదివారం సరోజ, శ్రీనును అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో జరిగిన సంఘటనను వివరించారు. దాంతో వారిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి చెప్పారు.