‘నువ్వులేక నేను లేను.. నువ్వే నా ప్రాణం’ అంటారు.. ‘నీ కోసం ప్రాణాలిస్తాం’ అంటారు.. ప్రేమిస్తే మళ్లీ ఇదేంటి.. ఎందుకింత పగ!?
ABN , First Publish Date - 2021-10-29T16:19:39+05:30 IST
అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఆకర్షణలో పడిపోవడం, ప్రేమ పేరుతో ...

- ప్రేమ.. పగ..
- ప్రేమిస్తే సరే.. తిరస్కరిస్తే ఉన్మాదమే..
- సైకోలుగా మారి యువతుల ప్రాణాలు తీస్తున్న యువకులు
అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఆకర్షణలో పడిపోవడం, ప్రేమ పేరుతో వెంటపడటం కొందరి యువకులకు ఫ్యాషన్ అయిపోయింది. ముందుగా ప్రేమిస్తున్నానంటూ వెంటబడతారు. ‘నువ్వులేక నేను లేను.. నువ్వే నా ప్రాణం’ అంటారు. ‘నీ కోసం ప్రాణాలిస్తాం’ అంటారు. ప్రేమను అంగీకరిస్తే.. ‘ఇక ఎవరితోనూ మాట్లాడొద్దు. స్నేహంగా, చనువుగా ఉండొద్దు..’ అంటూ పలు ఆంక్షలు పెడుతున్నారు. ప్రేమను అంగీకరించకపోతే ఆమెపై పగ పెంచుకుంటున్నారు. ఉన్మాదుల్లా మారి కడతేర్చేందుకు కూడా వెనకాడడం లేదు. ఈ తరహా ఘటనలు నగరంలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
హైదరాబాద్ సిటీ : ప్రేమ తిరస్కరించిందనే పగతో అమ్మాయిల జీవితాలను కొందరు యువకులు ఛిద్రం చేస్తున్నారు. అల్లారు ముద్దుగా, కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. ఇటీవల నగరంలో వరుసగా ఉన్మాద ఘటనలు వెలుగులోకి రావడంతో అమ్మాయిల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ ఉన్నతాధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
- పెళ్లి చేసుకొమన్నందుకు..
ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోపాటు.. పట్టించుకోకుండా ముఖం చాటేయడంతో ప్రియురాలు నిలదీసింది. దీంతో ఉన్మాదిగా మారిన అతను ఆమెను చంపేశాడు. కులాలు వేరన్న కారణంతో వివాహానికి ప్రియుడు ముందడుగు వేయలేదు. అయితే పెళ్లి చేసుకోవాలని నిలదీసిన ప్రియురాలిని నమ్మకంగా హోటల్కు తీసుకెళ్లి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. బయటకు వెళ్తే తన జీవితం జైలు పాలవుతుందని భావించి అతను కూడా గొంతుకోసుకొని, ఆపై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లెమన్ ట్రీ హోటల్లో జరిగింది.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు..
జులాయిగా తిరుగుతున్నావ్ అన్నందుకు..
-ప్రేమించిన వ్యక్తి పోకిరీగా, బాధ్యత లేకుండా జులాయిగా తిరుగుతున్నాడని, లైఫ్లో సెటిల్ అయితేనే పెళ్లి చేసుకుంటాను లేకుంటే చేసుకోను అని చెప్పినందుకు ప్రియురాలి గొంతుకోసి చంపేశాడో యువకుడు. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం చందానగర్ పరిధిలో జరిగింది. వేరే వారితో చనువుగా ఉండి, తనను నిర్లక్ష్యం చేస్తోందని, అందుకే పెళ్లికి నిరాకరించిందని భావించిన యువకుడు ప్రేమగా నమ్మించి ప్రియురాలిని చందానగర్లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. నిద్రలో ఉండగా దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత పారిపోయాడు.

- ప్రేమించలేదని ఇంటికి నిప్పంటించాడు..
ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడిన యువకుడు ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఇటీవల ఆ యువతికి పెళ్లి కుదిరిందని తెలిసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
