35 కంపెనీలు.. 3 వేల పోస్టులు

ABN , First Publish Date - 2021-02-28T17:23:34+05:30 IST

దేశంలోనే తొలిసారి ప్రత్యేకంగా మహిళా నిరుద్యోగ అభ్యర్థుల కోసం

35 కంపెనీలు.. 3 వేల పోస్టులు

  • షీటీం.. జాబ్‌ కనెక్ట్‌ మేళా 
  • మహిళలకు ప్రత్యేకం 


హైదరాబాద్‌ : దేశంలోనే తొలిసారి ప్రత్యేకంగా మహిళా నిరుద్యోగ అభ్యర్థుల కోసం హైదరాబాద్‌ సిటీ పోలీసులు (షీటీం ఆధ్వర్యంలో) జాబ్‌ కనెక్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొ.జి.రాంరెడ్డి డిస్టెన్స్‌ ఎడ్డుకేషన్‌ ఆవరణలో జరిగిన జాబ్‌మేళా కార్యక్రమానికి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులు, టీఎంఐఎస్‌ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి 4వేల మంది యువతులు హాజరయ్యారు. సుమారు 35 కంపెనీల ప్రతినిధులు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు, రిక్రూటర్లు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. సుమారు 3 వేల ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలలో పలువురు ఆఫర్‌ లెటర్లు అందుకున్నారు. 


కార్యక్రమం సందర్భంగా సీపీ మాట్లాడుతూ వచ్చే నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఉద్యోగాలు పొందడం ద్వారా నిరుద్యోగుల ఆనందం రెట్టింపు అవుతుందన్నారు. ఉద్యోగాలు పొందిన  వారు మహిళా దినోత్సవం నాటికి శిక్షణ లేదా ఉద్యోగాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. అనంతరం సీపీ చేతుల మీదుగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఆఫర్‌ లెటర్లు అందుకున్నారు. ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ రమేశ్‌, అదనపు సీపీ షికాగోయెల్‌, షీటీమ్‌ అదనపు డీసీపీ శిరీష ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T17:23:34+05:30 IST