భాగ్యనగర పోలీసింగ్లో యువరక్తం.. 162 మంది కొత్త ఎస్ఐలు
ABN , First Publish Date - 2021-11-30T14:36:16+05:30 IST
శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న 162 మంది సబ్ ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్వాగతించారు....
- స్వాగతం పలికిన సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ సిటీ : శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న 162 మంది సబ్ ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్వాగతించారు. సోమవారం పేట్లబురుజులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐలకు సీపీ పలు సూచనలిచ్చారు. 2020 బ్యాచ్కు చెందిన మొత్తం 203 మంది ఎస్ఐలను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కు కేటాయించగా, 162 మంది రిపోర్టు చేశారని, మిగతా వారు డిసెంబర్ 30న రిపోర్టు చేస్తారని సీపీ తెలిపారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను పోలీస్ శాఖ కచ్చితంగా అమలుచేస్తోందని, కొత్త వారిలో 61 మంది మహిళా ఎస్ఐలు ఉన్నారని తెలిపారు. పోలీస్ అంటేనే రక్షణ, భద్రత, బాధ్యత, జవాబుదారీతనం అన్నీ ఉంటాయన్నారు. అదనపు సీపీలు షికాగోయెల్, డీఎస్ చౌహాన్, విజయ్కుమార్, విక్రమ్ సింగ్ మాన్లు, జాయింట్ సీపీలు పి.విశ్వప్రసాద్, ఏఆర్ శ్రీనివాస్, ఎం.రమేశ్, సౌత్జోన్ డీసీపీ గజరావు భూపాల్, డీసీపీ అడ్మిన్ సునీతారెడ్డి కూడా నూతన ఎస్ఐలకు సూచనలిచ్చారు.