యాజమాన్యం మొండి వైఖరి సరికాదు

ABN , First Publish Date - 2021-10-08T04:10:34+05:30 IST

ఎస్పీఎంను టేకోవర్‌ చేసిన జేకే యాజమాన్యం మొండి వైఖరి తీరు ఏమాత్రం సరికాదని వివిధ పార్టీల నాయకులు అన్నారు.

యాజమాన్యం మొండి వైఖరి సరికాదు
జేసీఎల్‌ అధికారికి వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 7: ఎస్పీఎంను టేకోవర్‌ చేసిన జేకే యాజమాన్యం మొండి వైఖరి తీరు ఏమాత్రం సరికాదని వివిధ పార్టీల నాయకులు అన్నారు. గురువారం చర్చలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బీజేపీ నాయకుడు డాక్టర్‌ హరీష్‌బాబు మాట్లాడారు. జేకె యాజమాన్యం తీరు ఏ మాత్రం బాగా లేదన్నారు. ఒక వైపు చర్చలు జరుపుతూ కాలయాపన చేయడం, మరో వైపు కార్మికులను తీసివేసేందుకు యత్నించడం ఏంటని ప్రశ్నించారు. కార్మికులను తీసివేసేందుకు కనీసం చట్టంలో ఉన్న న్యాయపరమైన హక్కులు రాకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఒక్కొక్క కార్మికునికి లక్షల్లో బకాయిలు రావాల్సి ఉందన్నారు. 2014 వరకు లెక్కలు చూపించడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుళ్లపల్లి ఆనంద్‌ మాట్లాడుతూ కార్మికులకు రావాల్సిన న్యాయపరమైన హక్కుల కోసం తమ వంతు పోరాటం చేస్తామన్నారు. జేకే యాజమాన్యం కార్మికుల పట్ల ఉక్కుపాదం మోపడం సరికాదన్నారు. వెంటనే న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేట్టు చూడాలన్నారు. ఎస్పీఎం స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ నెగోషియేషన్‌ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జేకే యాజమాన్యం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. 2014 నుంచి 2021 వరకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వరంగల్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ అధికారికి నాయకులు సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సమావేశంలో కార్మికులు, వివిధ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T04:10:34+05:30 IST