రెబ్బెనలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-10-18T04:16:30+05:30 IST
బతుకమ్మ, దసరా పండుగలను పుట్టింట్లో ఆనందంగా జరుపుకుని వెళ్తున్న తల్లి, కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
తల్లి, కుమారుడి మృతి
- మరో కుమారుడు, మృతురాలి సోదరుడికి గాయాలు
- మిన్నంటిన కుటుంబీకుల రోదన
రెబ్బెన, అక్టోబరు 17: బతుకమ్మ, దసరా పండుగలను పుట్టింట్లో ఆనందంగా జరుపుకుని వెళ్తున్న తల్లి, కొడుకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మంచి ర్యాల పట్టణంలోని రాజీవ్నగర్కు చెందిన వెన్నంపల్లి సంగీత(28)కు పెంచికలపేట మండలం చెడ్వాయి గ్రామానికి చెందిన సాయితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అఖిల్(7), సిద్దు(5) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సాయి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుం టున్నాడు. సద్దుల బతుమ్మ, దసరా పండుగ కోసం సంగీత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఆదివారం తన సోదరుడు శివకుమార్తో బైక్పై చెడ్వాయికి బయలుదేరింది. రెబ్బెన మండల కేంద్రం నుంచి వెళుతుండగా శ్రీరామకాలనీ నుంచి హరీష్ అనే వ్యక్తి బైక్పై వస్తూ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో సంగీతతో పాటు ఇద్దరు పిల్లలు శివకుమార్ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ఎదురుగా కాగజ్నగర్ వైపు నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తున్న లారీ(ఏపీ16టీజే 4397) రోడ్డుపై పడిపోయిన సంగీత, ఆమె కుమారుడు అఖిల్పై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సంగీత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ అఖిల్, సిద్దు, శివకుమార్ను మంచిర్యాలకు తరలిస్తుండగా అఖిల్ మార్గమధ్యలో మృతి చెందాడు. సిద్దు, శివకుమార్ల పరిస్థితి సైతం విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి అన్న రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై భవానీసేన్ తెలిపారు.