కవులు సమాజాన్ని మేల్కొల్పాలి
ABN , First Publish Date - 2021-08-02T06:20:22+05:30 IST
నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత కవులు, రచయితలపై ఉందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు.
ఉట్నూర్, ఆగస్టు 1: నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని మేల్కొల్పాల్సిన బాధ్యత కవులు, రచయితలపై ఉందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సద్గుణ శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యో గంతో పాటు కవితలు, కథలు రాయడంతో పాటు సమాజహితం కోసం కవులు తమ వంతుగా ప్రయత్నాలు చేయడం మరింత జరగాలన్నారు. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలకు చైతన్యం కల్గించేలా కథలు, వ్యాసాలు రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన కేడీసీసీ చైర్మన్ కాంబ్లే నాందేవ్కు శ్రద్దాంజలి ఘటించారు. అంతకుముందు సద్గుణశతకం రచయిత నాగోరావు తన పుస్తకాన్ని తల్లిదండ్రులు రుక్మాబాయి, శ్యాంరావులకు ఆవిష్కరణ అనంతరం అంకితం చేశారు. ఇందులో రచయితలు గోపగాని రవీందర్, ఉదారి నారాయణ, కేజీ లక్ష్మయ్య, జాదవ్ బంకట్లాల్, మర్సుకోల తిరుపతి, మర్సుకోల సరస్వతి, గంగాసాగర్, కట్టా లక్ష్మణాచారి, శ్రావన్నాయక్, ఇందల్సింగ్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.