అవసరం ఉన్న వారికే ఆక్సిజన్ అందించాలి
ABN , First Publish Date - 2021-05-06T07:37:28+05:30 IST
అత్యవసరం ఉన్న వారికే ఆక్సిజన్లు అందించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు.
నిర్మల్ టౌన్, మే 5 : అత్యవసరం ఉన్న వారికే ఆక్సిజన్లు అందించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. బుధవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులకు, మేనేజ్మెంట్ వారికి వారు అందిస్తున్న కొవిడ్ సేవలపై జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ షారూఖీ సమావేశం నిర్వహించారు. జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ అవసరం ఉన్న వారికి మాత్రమే ఆక్సిజన్ అందించాలని, అవసరం లేకుండా డిమాండ్ చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ పెట్టరాదని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే చికిత్సకు డబ్బులు తీసుకోవాలని, అధికంగా డబ్బులు తీసుకున్నట్లయితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధన్రాజ్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.