ఖద్దర్ నేతలే కాంట్రాక్టర్లు!
ABN , First Publish Date - 2021-10-29T05:54:41+05:30 IST
జిల్లాలో కొందరు నేతలు రాజకీయ ముసుగులో కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి చలామణి అవుతున్నారు. రాజకీయ అండదండలతో అధికారులపై ఒత్తిళ్లు చేస్తూ పెత్తనం చలాయిస్తున్నారు. ఇటీవల ఓ స్థానిక నేత మున్సిపల్ అధికారులను బెదిరింపులకు గురిచేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పేరుకే ఆన్లైన్ టెండర్లు
నేతలు చెప్పిన వారికే పనుల అప్పగింత
అడ్డగోలు అంచనాలతో కమీషన్ దందా
బినామీ గుత్తేదారులకు అధికారుల అండదండలు
ఆదిలాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు నేతలు రాజకీయ ముసుగులో కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి చలామణి అవుతున్నారు. రాజకీయ అండదండలతో అధికారులపై ఒత్తిళ్లు చేస్తూ పెత్తనం చలాయిస్తున్నారు. ఇటీవల ఓ స్థానిక నేత మున్సిపల్ అధికారులను బెదిరింపులకు గురిచేయడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్థానిక ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్న కొందరు నేతలు వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రుల పేరిట అభివృద్ధి పనులు చేపడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో చక్రం తిప్పుతున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ మొదలుకొని జడ్పీటీసీ, ఎంపీపీ ఏకంగా జిల్లా స్థాయి నామినెట్ పదవుల్లో కొనసాగుతున్న నేతలంతా కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్నారు. అధికార పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకేసి బలవంతంగా అభివృద్ధి పనులను దక్కించుకుంటుండగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు బినామీలకు పనులను అప్పగిస్తూ పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్టీ కీలక పదవులను దక్కించుకుంటూ తాము చేపట్టే పనులకు అధికారులు అడ్డుచెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రజాసేవకు అంకితమవుతామని ఎన్నికల్లో గెలిచిన కొందరు నేతలు కాంట్రాక్ట్ పనుల్లో నిమగ్నం కావడంతో ప్రజల సమస్యలపై పట్టింపే లేకుండా పోతుందన్న విమర్శలు వస్తున్నాయి.
అంతా ఉత్తదే..
జిల్లాలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఆన్లైన్ టెండర్లను నిర్వహిస్తున్నామని పలుశాఖల అధికారులు చెబుతున్నా.. అదంతా ఉత్తదేనన్న వాదనలు బ లంగా వినిపిస్తున్నాయి. ఆన్లైన్ టెండర్ అనగానే ఏ జిల్లా నుంచైనా టెండర్లలో పాల్గొనే అవకాశం ఉం టుంది. దీంతో పోటీతత్వం పెరిగి ప్రభుత్వంపై ఖర్చు భారం తగ్గుతుంది. కానీ స్థానిక నేతల అనుమతి లేనిదే టెండర్లు వేసేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. ఎందుకంటే ముందుగానే అధికారులకు అగ్రనేతలు ఆర్డర్ వేయడంతో దాననుగుణంగానే టెండర్లతో పనులను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కాదు..కూడదు అంటే లేనిపోని కొర్రీలు పెడుతూ మరోసారి పనులు చేసేందుకు ముం దుకు రాకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. లోకల్, నాన్లోకల్ అనే విభేదాలతో ప్రొఫెషనల్ కాంట్రాక్టర్లను జిల్లావైపు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ అడిగినంతా ఇచ్చుకుంటే అడ్డుచెప్పకుండా వదిలేస్తున్నారు. ముందుగానే పలాన పనికి టెండర్లు వేయవద్దంటూ హెచ్చరించేందుకు వెనకాడడం లేదు.
మాట వినకుంటే వేటే..
కొందరు రాజకీయ నేతలే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తడంతో అధికారులు పనుల నాణ్యతపై ప్రశ్నించ లేక పోతున్నారు. దీంతో పనుల నాణ్యత మున్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. ఒకవేళ నిబంధనల ప్రకారం పనులు చేయాలని సూచించిన అధికారుల పై అగ్రనేతలకు లేనిపోని మాటలు చెప్పి బెదిరింపులకు గురిచేస్తున్నారు. చెప్పిన మాట వినకుంటే తమ నియోజక వర్గం నుంచి సెలవుపెట్టి వెళ్లిపోవాలని అగ్రనేతలు నేరుగా చెప్పడంతో చేసేదేమిలేక సైలెంట్ అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులతో ఇటీవల జిల్లాస్థాయి అధికారులు ఒకరిద్దరిపై వేటు పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో గత్యంతరంలేక నేతలు చెప్పిన బినామీ గుత్తేదారులకు అండదండగా ఉంటూ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
అంచనాలు పెంచి..
ప్రభుత్వం మంజూరు చేస్తున్న అభివృద్ధి పనులకు అధికారులు అంచనాలు పెంచి మరీ కమీషన్ దందాకు ఎగబడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అగ్రనేతలు చెప్పిన వారికే పనులు దక్కడంతో అవసరం లేకున్నా అంచనాలు వేస్తూ అదనంగా బిల్లులు ముట్టచెబుతూ అందినకాడికి కమీషన్ను దండుకుంటున్నారు. సాధారణంగా బిల్లులపై 5శాతం కమీషన్ తీసుకుంటున్న అధికారులు అంచనాలు పెంచి మరి మరో 2 శాతం కమీషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా వినిపిస్తోంది. అడ్డగోలుగా మెటీరియల్ ధరలు పెంచడం నిబంధనల ప్రకారం కాకుండా స్థానికంగా మెటీరియల్ కొరత ఉం దంటూ రవాణా చార్జీలను పెంచి చూపుతూ తలోకొంత దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లోనూ ఒకటి, రెండు సార్లు మార్పులు చేర్పులు చేసి అంచనాలు పెంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి.