పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి.. విద్యుత్షాక్తో మహిళా రైతు దుర్మరణం
ABN , First Publish Date - 2021-11-28T06:44:30+05:30 IST
పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి.. విద్యుత్ షాక్తో మహిళా రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం చందునాయక్తండాలో చోటు చేసుకుంది.

ఖానాపూర్ రూరల్, నవంబర్ 27 : పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి.. విద్యుత్ షాక్తో మహిళా రైతు మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం చందునాయక్తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చందునాయక్ తండాకు చెందిన రాథోడ్ నీలాబాయి (73) అనే గిరిజన మహిళా రైతుకు గ్రామ శివారులో ఎకరంన్నర వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తి, పసుపుతో పాటు పలు కూరగాయలు పండిస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం అర్ధరాత్రి తమ పంటకు సాగునీరు పెట్టేందుకు కుమారుడితో కలిసి వెళ్లింది. బోరు మోటార్ స్విచ్ వేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై తీవ్ర గాయాల పాలైంది. కొన ఊపిరితో ఉన్న నీలాబాయిని కుమారుడు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి భర్త బాలునాయక్, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.