తర్లాపాడ్ గ్రామంలో ఇళ్లల్లోకి చేరిన వరదనీరు
ABN , First Publish Date - 2021-09-29T05:48:09+05:30 IST
ఖానాపూర్లో మంగళవారం భారీవర్షం కురిసింది.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే రేఖానాయక్
ఖానాపూర్, సెప్టెంబర్ 28 : ఖానాపూర్లో మంగళవారం భారీవర్షం కురిసింది. సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం 10 గంటల వరకు ఎడతెరిపి లేని వర్షం కురవడంతో మండల కేంద్రంతో పాటు మండలంలోని పలుగ్రామాలలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వరదనీరు చేరింది. పట్టణంలో మురికినీటి కాల్వల్లో వరదనీరు పట్టకపోవడంతో రోడ్లపై ప్రవహించాయి. గోదావరి నదీ నిండుగా ప్రవహించడంతో పాటు రెంకోనవాగు ఉప్పొంగి ప్రవహించింది. మండలంలోని తర్లాపాడ్ గ్రామంలో వరదనీరు తీవ్రంగా వచ్చి పలువురి ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక సర్పంచ్ పెద్దిగోదావరి నర్సయ్య, టీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ రామిడి మహేష్లు ఈ విషయాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ దృష్టికి తీసుకెళ్ళడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎమ్మెల్యే సమీక్షించారు. వరదనీరు చేరి ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించారు. వారికి వెంటనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని మండల తహసీల్దార్ లక్ష్మీని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే తర్లాపాడ్లో వరదబాదితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చా రు. ఆమె వెంట తహసీల్దార్ లక్ష్మీ, ఎంపీడీవోతో పాటు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు తాళ్ళపెల్లి రాజగంగన్న, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షులు రామి డి మహేష్, మణికంఠ, స్థానిక నాయకులు పెద్ది నర్సయ్య, పడిగెల శేఖర్రెడ్డి, గోపు రత్నం, బొంత లింగన్న, దర్శినాల గంగాధర్ తదితరులున్నారు.