అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-29T05:57:39+05:30 IST

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. గురువారం మున్సిపల్‌ పరిధిలోని టీఎన్జీవోస్‌ భవన్‌ సెంట్రల్‌ గార్డెన్‌లో, బృందావన్‌ కాలనీలో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 28: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. గురువారం మున్సిపల్‌ పరిధిలోని టీఎన్జీవోస్‌ భవన్‌ సెంట్రల్‌ గార్డెన్‌లో, బృందావన్‌ కాలనీలో  వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి 18ఏళ్లు నిండిన వారి సమాచారం, కొవిడ్‌ టీకా తీసుకున్న, తీసుకోని వారి వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు టీకా తీసుకోని వారికి మొదటి డోసు ఇప్పించాలని, మొదటి డోసు తీసుకుని ఉండి రెండో డోసు తీసుకోని వారికి వెంటనే ఇప్పించాలన్నారు. సంబంధిత వార్డుల్లో స్పెషల్‌ అధికారి పర్యటించాలని, ఆశా, అంగన్‌వాడీ, మెప్మా సిబ్బంది గల టీంలు ప్రతీ ఇంటిలోని వారి సమాచారం సేకరించాలన్నారు. వార్డుల్లో ఆటోల ద్వారా ప్రచారం చేస్తూ వ్యాక్సిన్‌ అందించాలని సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. వారికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సంప్రదించేందుకు వైద్యాధికారి సెల్‌ నెంబర్‌ తెలపాలని ఆదేశించారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నరేందర్‌ రాథోడ్‌, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సాధన, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, మున్సిపల్‌ ఏఈ వెంకటశేషయ్య, శానినటరి ఇన్‌స్పెక్టర్‌ ఎం.నరేందర్‌, వైద్య, మున్సిపల్‌, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయించాలి: జడ్పీ సీఈవో

తలమడుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పని సరిగా కరోనా టీకా వేయించాలని జడ్పీ సీఈవో గణపతి కోరారు. గురువారం మండలంలోని ఖోడద్‌, ఉండం, సుంకిడి, కప్పర్‌దేవి, దేగామ తదితర గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ ఈ నెలాఖరుకల్లా మండలంలో వందశాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అదే విధంగా గ్రామంలో చేపడుతున్న పల్లెప్రగతి పనులను వేగవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం దేగామ గ్రామంలో చేపడుతున్న మెగాపార్కు పనులను పరిశీలించి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. ఇందులో ఎంపీడీవో రమాకాంత్‌, ఎంపీఈవో దిలీప్‌కుమార్‌, ఖోడద్‌ సర్పంచ్‌ ఆనంద్‌, ఉండం సర్పంచ్‌ నర్సింహులు, దేగామ గ్రామ సర్పంచ్‌ గోపాల్‌, పంచాయతీ సెక్రటరీలు తదితరులు ఉన్నారు.

బజార్‌హత్నూర్‌: మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ అందించేందుకు వైద్య, పంచాయతీ సిబ్బంది గడప గడపకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం వైద్యసిబ్బంది వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని గుర్తించి అవగాహన కల్పించారు. మొదటి డోసు వేసుకున్న వరు రెండో డోసును తీసుకోవాలన్నారు. 

Updated Date - 2021-10-29T05:57:39+05:30 IST