తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!

ABN , First Publish Date - 2021-11-27T04:07:16+05:30 IST

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!
రెబ్బెన మండలంలో వాగులో ఇసుక తోడుతున్న ఎక్స్‌కావేటర్‌(ఫైల్‌)

- జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా
- వాగులను తోడేస్తున్న అక్రమార్కులు
- పట్టించుకోని అధికారులు

ఆసిఫాబాద్‌, నవంబరు 26: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలన్ని వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జిల్లాలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేక పోయినా  ట్రాక్టర్ల యజమానులు నామ మాత్రంగా పర్మిట్లు తీసుకుంటున్నారు. ఒక్కో పర్మిట్‌పై పదేసి ట్రిప్పుల చొప్పున ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు రెవెన్యూ, పోలీసుల పాత్ర అపరిమితంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రాక్టర్‌ యజమానుల నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  జిల్లా కేంద్రంతో సహా 15 మండలాల్లోనూ ఇంచుమించు ఇదే తరహాలో మాఫియా దర్జాగా ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. జిల్లాలోని రెండు శాసనసభ నియోజక వర్గాల పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఇసుక మాఫీయాకు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పెద్దవాగు మొదలుకుని..
ఆసిఫాబాద్‌ పట్టణ శివారులోని పెద్దవాగు మొదలుకుని దహెగాం మండలంలోని ఎర్రవాగు వరకు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న ఇసుక చోరులు మాఫీయాను తలదన్నే రీతిలో ఏకంగా ఎక్స్‌కావేటర్లు, డోజర్లు వంటి యంత్ర సామాగ్రిని ఉపయోగించి మరీ ఇసుక వ్యాపారానికి తెర తీశారు. వాస్తవానికి కుమరం భీం జిల్లాలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్‌లు గుర్తించలేదు. కానీ జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్న వాగులు, వంకల ద్వారా ఉన్నా పోగయ్యే స్వల్ప పరిమాణం ఇసుక మేటలను కూడా వ్యాపారులు తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ, భూగర్భ జల వనరుల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను ఇసుకకు రూ.2000 నుంచి రూ.2500 వరకు ధర పలుకుతోంది.

నిబంధనల ప్రకారం..
నిబంధనల ప్రకారం లారీలలో ఇసుక తరలించరాదన్న ఆదేశాల దృష్ట్యా  అక్రమార్కులు వ్యూహాత్మకంగా రూట్‌ మార్చి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న డంప్‌లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా రెబ్బెన మండలంలోని గంగాపూర్‌, పులికుంట, కొండపల్లి వాగులతో పాటు దహెగాం మండలంలోని కల్వాడ ఎర్రవాగు, పెద్దవాగు, కౌటాల మండలంలోని ముత్తంపేట, తాట్‌పల్లి వాగులు, చింతలమానెపల్లి మండలంలోని రుద్రాపూర్‌, చింతలమానెపల్లి, కాగజ్‌నగర్‌ మండలంలోని రాస్పెల్లి, పెద్దవాగు, కెరమెరి మండలంలోని సాంగ్వీ, కైరి వాగు, సిర్పూర్‌(టి) మండలంలోని పెద్దబండ వాగుల నుంచి ఇసుక మాఫీ పెద్ద ఎత్తున ఇసుకను వెలికి తీస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారమంతా సంబంధిత తహసీల్దార్‌లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు తెలిసినప్పటికీ ఇసుక సిండికేట్లు ముట్ట చెప్పే మామూళ్లకు ఆశ పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసు అధికారులకు కూడా ఈ దందాలో భారీగానే దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాగులు వంకల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాల మూలంగా ఉన్న కొద్ది పాటి భూగర్భ జలాల మట్టం కూడా దారుణంగా పడి పోతున్నట్లు  భూగర్భ జల వనరుల శాఖ సేకరించిన సర్వేల్లో వెల్లడైంది.  దీంతో ఆయా ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, గూడాల్లో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తుతున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం నదులు, ఉప నదుల్లోనే మీటర్‌ లోతుకు మించి ఇసుక తవ్వకాలు జరపడం నిషేధం. వాల్టా చట్టాన్ని అనుసరించి వాగులు, వంకల్లో అసలు ఇసుకే తీయరాదు. కాగా జిల్లాలో అడుగడుగున నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమంగా ఇసుక దందా సాగుతుండడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్న తాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణకు అడ్డుకంట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..
- చిరంజీవి, సీపీఐ జిల్లా నాయకుడు

జిల్లాలో వాగులు, ఒర్రెల నుంచి అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీని ద్వారా భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు దీనిపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2021-11-27T04:07:16+05:30 IST