ఆదిలాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. జిల్లా కలెక్టర్ స్పందన
ABN , First Publish Date - 2021-08-25T17:07:35+05:30 IST
ఆదివాసీ మహిళల ప్రసవ వేదనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు అధికారవర్గాలు స్పందించాయి.

ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసీ మహిళల ప్రసవ వేదనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు అధికారవర్గాలు స్పందించాయి. బాధిత కుటుంబాన్ని కలెక్టర్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. రహదారితో పాటు వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
స్వాంతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా.. ఆదివాసీల కష్టాలు మాత్రం తీరడం లేదు. కనీస మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీలో సరైన రహదారి వ్యవస్థ లేక ఆదివాసుల నరకయాతనపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. పాలకుల నిర్లక్ష్యానికి నిండు గర్భిణీ మృతి చెందడాన్ని ఏబీఎన్ ఎత్తిచూపింది.
ఈనెల 22న కోలాంగూడకు చెందిన ఆదివాసీ మహిళకు పురిటినొప్పులు రావడంతో... కుటుంబసభ్యులు 108 అంబులెన్స్కు కాల్ చేశారు. అయితే మార్గమధ్యంలో ఉన్న వాగు ఉప్పొంగడంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో గర్భిణీని మోసుకుంటూ.. కుటుంబసభ్యులు వాగు వద్దకు చేరుకున్నారు. మహిళకు నొప్పులు ఎక్కువ అవ్వడంతో.. ఆమెను భుజాలపై మోసుకుంటూ వాగు దాటారు. అక్కడి నుంచి పీహెచ్సీకి వెల్లారు. అప్పటికే ఆమె పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆదిలాబాద్ రిమ్స్కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలో గర్భిణీ చనిపోయింది.
ఈ ఘటనతోపాటు... ఆదివాసీల కష్టాలపై జిల్లా కలెక్టర్ సీరియస్గా స్పందించారు. అధికార యంత్రాంగంతో స్వయంగా కలెక్టర్ కోలామ్ గూడకు వచ్చారు. ఈ క్రమంలో కలెక్టర్ సహా అధికారులు, సిబ్బంది అతికష్టం మీద వాగును దాటారు. గ్రామానికి చెందిన మహిళలు కలెక్టర్ను వాగు దాటించారు. అక్కడి నుంచి నేరుగా బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయంగా రూ. 25వేలు అందించారు. గ్రామస్తులతో సమస్యలపై కలెక్టర్ చర్చించారు. ఏజెన్సీలో వైద్య సిబ్బంది పనితీరును సమీక్షిస్తామని, విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కలెక్టర్. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని అన్నారు.