కాపురం పాడు చేసుకోవద్దని తండ్రి చెప్పినా ఆమె వినలేదు.. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లాక ఊహించని దారుణం..!
ABN , First Publish Date - 2021-08-02T17:28:19+05:30 IST
ఆమెకు పెళ్లి జరిగి 8 సంవత్సరాలు.. ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న సంసారం..
ఆమెకు పెళ్లి జరిగి 8 సంవత్సరాలు.. ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న సంసారం.. అలాంటి సమయంలో ఆమె ఎదురింటి వ్యక్తితో ప్రేమలో పడింది.. భర్త, తండ్రి నచ్చచెప్పినా ఆమె వినలేదు.. చక్కని సంసారాన్ని వదులుకుని ప్రియుడితో వెళ్లిపోయింది.. అనంతరం ప్రియుడి సహాయంతో భర్తనే బెదిరించింది.. దీనిని భరించలేకపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు.. ఇద్దరు పిల్లలను చంపేసి తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. హర్యానాలోని కర్నల్ జిల్లాలో జరిగింది.
కర్నల్ జిల్లాలో బాద్సో గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్, సిమా దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్ని రోజుల క్రితం సీమా తమ ఎదురింట్లో ఉండే కరణ్బీర్తో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను పట్టించుకోకుండా అతడితో విహార యాత్రలకు వెళ్లేది. ఈ విషయం తెలిసి భర్త, అతని తరఫువారు ఆమెను మందలించారు. చక్కని సంసారాన్ని పాడు చేసుకోవద్దంటూ సీమా తండ్రి కూడా ఆమెకు నచ్చచెప్పాడు. అయినా ఆమె వినలేదు. గత నెలలో ఇంట్లోని బంగారం, డబ్బు తీసుకుని కరణ్బీర్తో వెళ్లిపోయింది.
అక్కణ్నుంచి భర్తకు ఫోన్ చేసింది. బాద్సో గ్రామంలోని మీ ఎదురింట్లోనే తాము కాపురం పెడతామని, పిల్లలిద్దర్నీ తాము తీసుకుంటామని భర్తను బెదిరించింది. దీనిని తట్టుకోలేకపోయిన భర్త దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలిద్దరికీ విషం ఇచ్చి చంపేశాడు. అనంతరం తను ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీమాను, కరణ్బీర్ను అదుపులోకి తీసుకున్నారు.