ఒక్క మెరుపు 18 ఏనుగులను చంపిందా..? శాస్త్రవేత్తలు చెప్పేది వింటే షాకవ్వడం ఖాయం..!

ABN , First Publish Date - 2021-05-20T22:41:09+05:30 IST

ఒకే చోట 18 ఏనుగులు చనిపోయి, వాటి కళేబరాలు కనిపించిన ఘటన ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కలకలం సృష్టిస్తోంది. అసలు ఈ ఏనుగులు ఎలా మరణించాయి..? ఎవరైనా చంపేశారా..? లేక ప్రమాదానికి గురయ్యాయా? ఏకంగా 18 ఏనుగులు మరణించడమేంటి..?

ఒక్క మెరుపు 18 ఏనుగులను చంపిందా..? శాస్త్రవేత్తలు చెప్పేది వింటే షాకవ్వడం ఖాయం..!

ఒకే చోట 18 ఏనుగులు చనిపోయి, వాటి కళేబరాలు కనిపించిన ఘటన ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కలకలం సృష్టిస్తోంది. అసలు ఈ ఏనుగులు ఎలా మరణించాయి..? ఎవరైనా చంపేశారా..? లేక ప్రమాదానికి గురయ్యాయా? ఏకంగా 18 ఏనుగులు మరణించడమేంటి..? ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరిగిన దాఖలాలు కూడా లేకపోవడంతో విషప్రయోగం ఏమయినా జరిగిందా..? అన్న అనుమానాలు అందరిలోనూ రేకెత్తాయి. ఈ 18 ఏనుగుల అనుమానాస్పత మృతికి అసలు కారణాలేంటన్నది త్వరగా తేల్చాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ 18 ఏనుగుల డెత్ మిస్టరీని చేధించేందుకు అస్సాం ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నుంచి ఇంకా రిపోర్టు రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా కనిపించిన ఆధారాలను బట్టి ఆ ఏనుగులు మెరుపు/పిడుగుపాటు వల్లే చనిపోయాయని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీంతో అసలు పిడుగుపాటు వల్ల ఏనుగులు చనిపోవడం జరిగే పనేనా..? అంటూ సరికొత్త ప్రశ్నలను జంతు ప్రేమికులు సంధిస్తున్నారు. ఇంతకీ అస్సాం రాష్ట్రంలో అసలేం జరిగిందంటే..


అది అస్సాం రాష్ట్రంలోని బాముని కొండ ప్రాంతం. అక్కడకు తాజాగా వెళ్లిన కొందరికి 18 ఏనుగుల కళేబరాలు కంటపడ్డాయి. వీటిని చూసిన వాళ్లు వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఆ కళేబరాలను పంచనామా నిమిత్తం జంతు వైద్య శాలకు తరలించారు. ఏనుగుల మరణానికి కారణం ఏంటన్నది తేల్చడం కోసం ప్రభుత్వం హుటాహుటిన ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని విధాలుగా దర్యాప్తు చేసి ఆ ఏనుగుల మరణానికి అసలు కారణాలేంటన్నది త్వరలోనే బయటపెట్టబోతోంది. అయితే ఈ లోపే పిడుగుపాటు/మెరుపు వల్లే ఏనుగులు చనిపోయాయని కొందరు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల నుంచి వ్యాఖ్యలు వినిపించాయి. మీడియాలోనూ ఈ తరహా వార్తలు వచ్చాయి. అయితే అసలు మెరుపు కూలడం వల్ల ఏనుగులు చనిపోతాయా..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏనుగుల మృతికి పిడుగుపాటు ఎలా కారణం అవుతుంది..? అన్న ప్రశ్నలు జంతు ప్రేమికుల నుంచి వెల్లువలా వచ్చాయి. ఇదేమీ నమ్మశక్యంగా లేదంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే వీటికి శాస్త్రవేత్తల నుంచి షాకింగ్ సమాధానాలు వచ్చాయి. ఇంతకీ ఆ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే.. 


సాధారణంగా పెద్ద సైజులో ఉండే ఏనుగులు, పొడవుగా ఉండే జిరాఫీలు వంటి జంతువులు ఖాళీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిపై పిడుగు పడే అవకాశం ఉంటుందిట. దీన్ని డైరెక్ట్ ఫ్లాష్ అని అంటారు. అలాగే ఒక్కోసారి సదరు జంతువులకు సమీపంలో ఉండే పొడవైన చెట్లు ఇతర జీవరాసులపై పడిన పిడుగు అక్కడి నుంచి వక్రీభవనం చెంది జంతువులను తాకినప్పుడు జంతువులు చనిపోవచ్చు. అలాగే మరో మార్గం ఏంటంటే.. వేరే వస్తువుపై పడిన పిడుగు నుంచి విద్యుత్ శక్తి నేలలోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సదరు జంతువు గనుక సమీపంలో ఉంటే.. భూమి ద్వారా ప్రసరించిన విద్యుత్ సదరు జంతువుల శరీరంలో ప్రవేశిస్తుంది. దీన్ని స్టెప్ పొటెన్షియల్ అంటారు. అస్సాంలో జరిగిన ఘటన దీనికి సరైన ఉదాహరణ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అస్సాంలో మృతి చెందిన ఏనుగుల కళేబరాలకు పోస్టు మార్టం చేసిన నిపుణులు కూడా పిడుగుపాటు వల్లే సదరు ఏనుగులు మరణించినట్లు భావిస్తున్నారట. అస్సాంలో కొన్ని ఏనుగుల శరీరాలపై కూడా మెరుపు వల్ల కలిగిన గాయాలు కనిపించాయని తెలుస్తోంది.


స్టెప్ పొటెన్షియల్ విధానంలో చాలా జంతువులు మరణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఎత్తయిన వస్తువులపై పిడుగు పడినప్పుడు, ఆ సమయంలో ఆ వస్తువును కనుక పెద్ద సైజులోని జంతువులు పట్టుకొని ఉన్నా కూడా అవి మరణించే అవకాశం ఉంది. ఇలా కేవలం ఏనుగులకే జరుగుతుందా? అంటే అదేమీ లేదు. కాకపోతే మిగతా జంతువులతో పోలిస్తే ఏనుగులు భారీ సైజులో ఉండటం వల్ల సాధారణంగా ఇవి పిడుగుపాటుకు గురవుతాయని తెలుస్తోంది. ఇలా పిడుగు పడి ఒకేసారి ఎక్కవ సంఖ్యలో జంతువులు చనిపోవడం చరిత్రలో ఇదేమీ కొత్త కాదు. 1972లో అలస్కాలో 53 రెయిన్ డీర్లు ఒక్క మెరుపుతో దెబ్బతిన్నాయి. అలాగే 2016లో కూడా 300పైగా రెయిన్‌డీర్లు కూడా ఇదే తరహాలు మరణించాయి. ఆ తర్వాత 2007లో కూడా పశ్చి బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వులో ఐదు ఏనుగులు మెరుపు దాడికి బలయ్యాయి.

Updated Date - 2021-05-20T22:41:09+05:30 IST