నిందితుడికి కొమ్ము కాసిన ఖాకీ.. పోలీస్ స్టేషన్లోనే విషం తాగిన బాధితురాలు.. చివరికేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2021-10-11T12:45:17+05:30 IST
ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్నవు సమీపంలోని ఒక గ్రామంలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. బాధితురాలు పోలీస్ స్టేషన్లోనే విషం తాగి చనిపోయింది. ఈ విషయం రాష్ట్రంమంతా కలకలం సృష్టించింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆ పోలీస్ స్టేషన్..
ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్నవు సమీపంలోని ఒక గ్రామంలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. బాధితురాలు పోలీస్ స్టేషన్లోనే విషం తాగి చనిపోయింది. ఈ విషయం రాష్ట్రంమంతా కలకలం సృష్టించింది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆ పోలీస్ స్టేషన్ ఇన్చార్జిని సస్పెండ్ చేశారు.
బాధితురాలు ఒక పేద కుటుంబానికి చెందిన వివాహిత యువతి. తనపై అత్యచారం జరిగిదంటూ ఆమె తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు నిందితుడి గుర్తింపు కూడా తెలియజేసింది. కానీ పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీనికి కారణం.. నిందితుడు ఒక బడా కుటుంబానికి చెందిన వ్యక్తి కావడమే అని బాధితురాలి భర్త ఆరోపించాడు.
తాము నిందితుడి ఆచూకీ గురించి అన్ని వివరాలు పోలీసులకు తెలియచేసినా.. నిందితుడిని అరెస్టు చేయలేదని బాధితురాలి భర్త వాపోయాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి.. చివరికి విసిగిపోయి తన భార్య పోలీస్ స్టేషన్లోనే విషం తాగిందని అతను చెప్పాడు. విషం తాగిన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మీడియా కథనాలు ప్రసారం చేసింది. పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్ ఇన్చార్జిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. నిందితుడు ఇంతవరకూ అరెస్టు కాలేదు.
ప్రస్తుతం ఈ కేసు రాజకీయంగా వేడి పుంజుకుంది. ఉత్తర్ ప్రదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. సామాన్యులకు న్యాయం అందించకుండా.. బడా వ్యక్తులకు బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని.. ప్రతిపక్షనాయకుడు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు.