AryanKhan డ్రగ్స్ కేసు కొత్త దర్యాప్తు అధికారి సంజయ్కుమార్ చరిత్ర తెలిస్తే షాకవ్వాల్సిందే...
ABN , First Publish Date - 2021-11-06T14:02:48+05:30 IST
దేశంలో సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే...
గతంలో డ్రగ్స్ రాకెట్ల గుట్టును ఛేదించిన వీరుడు
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీసు విభాగం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లలో వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో ఈయన పలు అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ ల గుట్టును రట్టు చేసి సమర్ధ అధికారిగా పేరొందారు. సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ను అరెస్టు చేసిన క్రూయిజ్ డ్రగ్ కేసును ఇప్పుడు సిట్కు నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ విచారించనున్నారు.
ఒడిశా పోలీసు డ్రగ్ టాస్క్ ఫోర్స్ ఏడీజీగా...
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్పై డ్రగ్స్ కేసుతో సహా ఆరు కేసులను సమీర్ వాంఖడే నేతృత్వంలోని ముంబై జోన్ నుంచి ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేసింది. ఆర్యన్ ఖాన్ కేసులో అవినీతి, విధానపరమైన లోపాల ఆరోపణలపై ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే, ఇతరులపై ఎన్సీబీ విజిలెన్స్ బృందం విచారణ ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరిగింది.సంజయ్ కుమార్ సింగ్ 1996 బ్యాచ్ ఒడిశా ఐపీఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) క్యాడర్ అధికారి.ఎన్సీబీలో చేరడానికి ముందు సంజయ్ కుమార్ సింగ్ ఒడిశా పోలీసు డ్రగ్ టాస్క్ ఫోర్స్ (డీటీఎఫ్)కి అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా నాయకత్వం వహించారు. డీటీఎఫ్ లో ఉన్నపుడు సింగ్ ఒడిశా రాష్ట్రంలో డ్రగ్స్ వ్యతిరేక డ్రైవ్లను ప్రారంభించారు.
డ్రగ్ రాకెట్ల గుట్టును రట్టు చేసిన వీరుడు
భువనేశ్వర్లో పలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా రాకెట్లను ఛేదించారు.2008లో సింగ్ సీబీఐలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా 2015 వరకు పనిచేశారు. సీబీఐలో పనిచేసిన సమయంలో ఇతను పలు హై ప్రొఫైల్ కేసులను దర్యాప్తు చేశారు.సంజయ్ కుమార్ సింగ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా, ఒడిశా పోలీస్ ట్విన్ సిటీ, ఒడిశా పోలీస్ అదనపు కమిషనర్గా కూడా పనిచేశారు.జనవరి 2021లో సంజయ్ కుమార్ సింగ్ను కేంద్ర ఏజెన్సీకి డిప్యూటేషన్పై పంపారు. సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా చేరారు.సింగ్ పై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు లేదా క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని సమర్ధ అధికారిగా గుర్తింపు పొందారని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.