court says: భార్యతో బలవంతంగా శృంగారం చేయడం చట్టవిరుద్ధం కాదు
ABN , First Publish Date - 2021-08-13T16:33:53+05:30 IST
భార్యతో బలవంతంగా శృంగారం చేయడంపై ముంబై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది....
ముంబై : భార్యతో బలవంతంగా శృంగారం చేయడంపై ముంబై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహం అనంతరం భార్యతో బలవంతంగా శృంగారం చేయడం చట్టవిరుద్ధమని పిలవలేమని ముంబై అదనపు సెషన్స్ కోర్టు జడ్జి సంజశ్రీ జె ఘరత్ వ్యాఖ్యానించారు. తన భర్త తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, దాని ఫలితంగా తనకు పక్షవాతం వచ్చిందని ముంబైకు చెందిన ఒక మహిళ ఆరోపించింది. అయితే, ఇది చట్టవిరుద్ధమైన చర్య కాదని పేర్కొన్న కోర్టు, నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.నిందితుడు భర్త కావడం వల్ల అతను ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేశాడని చెప్పలేమని జడ్జి సంజశ్రీ చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, బాధిత మహిళ గత ఏడాది నవంబర్ 22 న వివాహం చేసుకుంది. వివాహానంతరం, భర్త,అతని కుటుంబం తనపై ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారని, తనను అవహేళన చేశారని, తనను హింసించారని, డబ్బు డిమాండ్ చేయడం కూడా ప్రారంభించారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లైన నెల రోజుల తర్వాత భర్త తన ఇష్టానికి విరుద్ధంగా తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని మహిళ ఆరోపించింది. ఈ ఏడాది జనవరి 2 వతేదీన ఈ జంట ముంబై సమీపంలోని హిల్ స్టేషన్ అయిన మహాబలేశ్వర్కు వెళ్లింది. అక్కడ భర్త మళ్లీ భార్యపై బలవంతం చేశాడు.
ఆ తర్వాత, తనకు అనారోగ్యం అనిపించిందని, డాక్టరుకు చూపించగా, పరీక్ష తర్వాత, తన నడుము కింద పక్షవాతం వచ్చినట్లు తేల్చారు.దీని తరువాత బాధిత భార్య తన భర్త, ఇతరులపై ముంబైలో కేసు పెట్టింది. ఈ కేసులో నిందితులైన భర్త ముందస్తు బెయిల్ దరఖాస్తుతో కోర్టును ఆశ్రయించారు.నిందితులకు ముందస్తు బెయిల్ పిటిషన్ మంజూరు చేయడాన్ని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. అయితే, వరకట్నం డిమాండ్పై మహిళ ఫిర్యాదు చేసినప్పటికీ, డిమాండ్ ఎంత చేశారో ఆమె చెప్పలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.అంతేకాకుండా, బలవంతపు శృంగారం సమస్య న్యాయపరమైన అంశంగా నిలబడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
‘‘ఆ వివాహితకు పక్షవాతం రావడం దురదృష్టకరం. అయితే, బెయిల్ దరఖాస్తుదారులు (భర్త అతని కుటుంబం) దీనికి బాధ్యత వహించలేరు. బెయిలు దరఖాస్తుదారులపై చేసిన ఆరోపణల స్వభావాన్ని పరిశీలిస్తే, కస్టడీ విచారణ అవసరం లేదు. విచారణ సమయంలో సహకరించడానికి నిందితులు సిద్ధంగా ఉన్నారు.’’ అని ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఘరత్ పేర్కొన్నారు.