కుమారుని పాడె ఎత్తేందుకు ఎవరూ రాకపోవడంతో... ఆ తండ్రి ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-04-19T16:47:57+05:30 IST

కరోనా వైరస్ మనుషులనే కాదు...

కుమారుని పాడె ఎత్తేందుకు ఎవరూ రాకపోవడంతో... ఆ తండ్రి ఏం చేశాడంటే...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ మనుషులనే కాదు మనుషుల్లోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. ఇటువంటి రోజుల వస్తాయని కూడా ఎవరూ ఊహించివుండరు. కరోనా మృతుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో అనేక దయనీయ గాథలు వెలుగులోకి వస్తున్నాయి. యూపీలోని లక్నోలో చోటుచేసుకున్న ఒక హృదయ విదారక గాథ అందరినీ కంటతడిపెట్టిస్తోంది. తన 13 ఏళ్ల కుమారుని మృతదేహాన్ని ఎత్తేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ తండ్రి విలవిలలాడిపోయాడు. ఇందుకోసం ఎంతమందిని అర్థించినా, కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ తండ్రి ఒక కాలువ పక్కన గొయ్యి తవ్వి కుమారుని మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. ఈ ఘటన లక్నో పరిధిలోని చినాహట్ ప్రాంతంలో జరిగింది. భాధితుడు సూరజ్‌పాల్ కుమారునికి వారం రోజుులుగా తీవ్రమైన జ్వరం వస్తోంది. దీంతో ఇంటి దగ్గరే ఉండి చికిత్స అందుకుంటున్నాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. కరోనా భయంతో ఆ బాలుని మృతదేహాన్ని స్మశాన వాటిక వరకూ తీసుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తండ్రే తన కుమారుని మృతదేహాన్ని భుజాల మీద వేసుకుని కాలువ వరకూ తీసుకువెళ్లి, అక్కడ ఖననం చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు సూరజ్‌పాల్ మాట్లాడుతూ తన కుమారుడు కోవిడ్ బాధితుడు కాదని, జ్వరంతోనే చనిపోయాడన్నారు. అయితే కోవిడ్ భయంతో తన కుమారుని మృతదేహాన్ని ఎత్తేందుకు ఎవరూ ముందుకు రాలేదని వాపోయాడు. 




Updated Date - 2021-04-19T16:47:57+05:30 IST