ముంబై ఎయిర్పోర్టులో మహిళ అరెస్ట్.. రూ.21 కోట్ల హెరాయిన్ స్వాధీనం...
ABN , First Publish Date - 2021-06-18T05:12:56+05:30 IST
ముంబై ఎయిర్పోర్టులో మహిళ అరెస్ట్.. రూ.21 కోట్ల హెరాయిన్ స్వాధీనం...
ముంబై: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఇవాళ ముంబై ఎయిర్పోర్టులో జాంబియాకి చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.21 కోట్ల విలువచేసే మూడు కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని జులియానా ముతాలేగా గుర్తించామనీ.. జోహెన్నెస్బర్గ్ నుంచి దోహా మీదుగా ఆమె ముంబైకి వచ్చిందని అధికారులు వెల్లడించారు. నిఘా వర్గాలు సమాచారం అందించడంతో డీఆర్ఐ అధికారులు ఆమె బ్యాగ్ను తనిఖీ చేసి హెరాయిన్ ప్యాకెట్ ఉన్నట్టు గుర్తించారు. జోహెన్నెస్బర్గ్లో ఎవరో ఒక వ్యక్తి తనకు ఈ బ్యాగును ఇచ్చాడనీ... దీన్ని ముంబైలో ఇవ్వమని చెప్పాడని ఆమె అధికారులకు చెప్పినట్టు సమాచారం. డబ్బుల కోసం తాను ‘మ్యూల్’ (డ్రగ్ తరలించే వ్యక్తి)గా పనిచేస్తున్నట్టు ఆమె విచారణలో అంగీకరించిందని అధికారులు పేర్కొన్నారు. స్థానిక కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కాగా గత ఆరు నెలల్లో ముంబై డీఆర్ఐ విభాగం అధికారులు ప్రయాణికుల ముసుగులో జరుగుతున్న నార్కోటిక్స్ స్మగ్లింగ్ను గుర్తించడం ఇది నాలుగోసారి.