మాఫియాకు చెక్ పెట్టిన యోగి సర్కార్: అమిత్షా
ABN , First Publish Date - 2021-10-29T21:25:26+05:30 IST
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ గణనీయమైన పురోగతిని సాధించిందని, యోగి ఆదిత్యనాథ్...

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ గణనీయమైన పురోగతిని సాధించిందని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో మాఫియాను నిర్మూలించిందని కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రశంసించారు. బీజేపీ సభ్యత్య నమోదు కార్యక్రమాన్ని శుక్రవారంనాడు లక్నోలో ఆయన ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్లేందుకు తమకు మరో ఐదు సంవత్సరాలు అవసరమని, 2024లో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి 2022 ఎన్నికలు నాంది కావాలని అన్నారు.
''ఇది రాముడు, మహదవ్, కృష్ణుడు, కబీర్, బుద్ధుడు, సుహల్దేవ్, మదన్ మోహన్ మాలవీయ పుట్టిన గడ్డ. ఇప్పుడు ఈ గడ్డ అభివృద్ధి బాట పట్టింది. అభివృద్ధి అనేది ఒక కుటుంబానికో, ఒక కులానికో పరిమితం కాకుండా అందరికీ చేరుతోంది. ముఖ్యంగా అత్యంత నిరుపేదల కోసం అభివృద్ధిని ఉద్దేశించాం'' అని అమిత్షా అన్నారు.
అఖిలేష్ బాబూ..ఈ ఐదేళ్లు ఎక్కడున్నారు?
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్పై అమిత్షా విమర్శలు గుప్పించారు. ''ఐదేళ్లుగా ఇంటిపట్టే కూర్చుని, ఇప్పుడు కొత్త బట్టలు కుట్టించుకుని, అధికారంలోకి వస్తామంటూ కొందరు చెబుతున్నారు. అఖిలేష్ బాబును నేను ఒకటి అడగదలచుకున్నాను. ఈ ఐదేళ్లలో ఆయన ఎన్ని రోజులు విదేశాల్లో గడిపారు? కోవిడ్ సమయంలో, వరదలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఈ వ్యక్తులు తమ కుటుంబం కోసం, కులం కోసం ప్రభుత్వాలు నడిపారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అందరి కోసం పనిచేసింది'' అని షా అన్నారు.
నాలుగు కోట్ల సభ్యత్వాలు లక్ష్యంగా చేపట్టిన ''మేరా పరివార్-బీజేపీ పరివార్'' ప్రచారం ఈనెల 29 నుంచి డిసెంబర్ 31 వరకూ జరుగుతుందని, పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగించాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని అమిత్షా దిశానిర్దేశం చేశారు. ప్రజలు, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టో ఉంటుందని, 2017లో ఇచ్చిన వాగ్దానాల్లో 90 శాతం నెరవేర్చామని అన్నారు. ఎస్పీ, బీఎస్పీలు రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే, ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ అభివృద్ధిని పట్టాల మీదకు తీసుకువచ్చిందని ప్రశంసించారు.