ఆల్మట్టి ఎత్తు పెంచడం తథ్యం
ABN , First Publish Date - 2021-08-29T06:47:02+05:30 IST
అప్పర్ కృష్ణా ప్రాజెక్టులో భాగంగా ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 524 అడుగులకు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు...
- కృష్ణా జలాల వినియోగంలో రాజీ ప్రశ్నే లేదు
- అవసరమైతే న్యాయనిపుణులతో చర్చిస్తాం
- కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై
బెంగళూరు, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): అప్పర్ కృష్ణా ప్రాజెక్టులో భాగంగా ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 524 అడుగులకు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. అవసరమైతే ఈ అంశంపై మరోమారు న్యాయనిపుణులతో చర్చిస్తామన్నారు. ట్రైబ్యునల్ తీర్పునకు లోబడి కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా హక్కును వినియోగించుకునే విషయంలో రాజీ ప్రశ్నేలేదన్నారు. సొంత జిల్లా హావేరి పర్యటనలో భాగంగా శనివారం ఆయన హీరేకెరూర్లో మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపునకు సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో వివాదం పెండింగ్లో ఉందన్నారు. ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా జల వివాదాలకు సంబంధించి కేసుల పురోగతిని సమీక్షించామన్నారు.
ఆల్మట్టి ఎత్తు పెంపుతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో ఆనకట్టలన్నీ పటిష్ఠంగా ఉన్నాయని, వాటికొచ్చిన ముప్పేమీ లేదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు, మేకెదాటు, మహదాయి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వ చట్టబద్ధంగానే ముందుకు సాగాలని భావిస్తోందన్నారు. కేఆర్ఎస్ ఆనకట్టకు పగుళ్లు ఏర్పడ్డాయన్న ఆరోపణల నేపథ్యంలో సమగ్ర సమీక్ష జరపాలని నిపుణుల కమిటీకి సూచించామన్నారు. సుప్రీంకోర్టులో క్లియరెన్స్ రాగానే మేకెదాటు, ఆల్మట్టి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేస్తామని కేంద్ర జల వనరుల శాఖ భరోసా ఇచ్చిందని సీఎం వివరించారు. కాగా, మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని, అలాగే శాఖల మార్పు ప్రశ్నే లేదని బొమ్మై స్పష్టం చేశారు