కొవిడ్ నుంచి కోలుకున్న 70 ఏళ్ల వృద్ధుడిలో వైట్ ఫంగస్

ABN , First Publish Date - 2021-05-21T22:08:47+05:30 IST

తొలి వైట్ ఫంగస్ కేసు వెలుగుచూసింది. కరోనా నుంచి కోలుకున్న 70 ఏళ్ల మవాకు చెందిన వృద్ధుడిలో ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు.

కొవిడ్ నుంచి కోలుకున్న 70 ఏళ్ల వృద్ధుడిలో వైట్ ఫంగస్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తొలి వైట్ ఫంగస్ కేసు వెలుగుచూసింది. కరోనా నుంచి కోలుకున్న 70 ఏళ్ల మవాకు చెందిన వృద్ధుడిలో ఈ ఇన్ఫెక్షన్‌ను గుర్తించారు. కరోనా బారినపడిన వృద్ధుడు ఏప్రిల్‌లో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. కోలుకున్న అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. తాజాగా అతడు వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు వైద్యులు నిర్ధారించారు. 


కరోనా చికిత్స సమయంలో వృద్ధుడికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇచ్చారని విట్రియో-రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ క్షితిజ్ ఆదిత్య పేర్కొన్నారు. ఆ తర్వాత అతడిలో నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తాయని, క్రమంగా కంటి చూపు కోల్పోయాడని తెలిపారు. బాధితుడిని పరీక్షించినప్పుడు రక్తం ద్వారా కంటికి ఇన్ఫెక్షన్ (ఎండోజెనస్ ఫంగల్ ఎండోఫ్తాల్మిటిస్) సోకినట్టు గుర్తించినట్టు వివరించారు. ఆ తర్వాత నిర్వహించిన విట్రియస్ బయాప్సీలో వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్‌ను నిర్ధారించినట్టు తెలిపారు. 


కరోనాకు చికిత్స తీసుకుని కోలుకున్న అనంతరం చూపు మందగిస్తే ముఖ్యంగా స్టెరాయిడ్స్ తీసుకున్న వారు, మధుమేహం ఉన్నవారు వెంటనే నేత్ర వైద్యులను కలవాలని మరీ ముఖ్యంగా రెటీనా స్పెషలిస్టులను కలవాలని డాక్టర్ క్షితిజ్ ఆదిత్య సూచించారు. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మధుమేహంతో బాధపడుతున్నవారు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు వైట్ ఫంగస్ బారినపడే అవకాశాలు ఎక్కువ.


అలాగే, కరోనా వైరస్ చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నవారికి కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. కళ్లు, ఊపిరితిత్తులు, మెదడు, గోళ్లు, చర్మ, కిడ్నీలు, రహస్య భాగాలకు ఇది సులభంగా సోకుతుంది.


Updated Date - 2021-05-21T22:08:47+05:30 IST