ఏనుగును కాపాడిన అటవీశాఖాధికారులు
ABN , First Publish Date - 2021-02-26T12:50:38+05:30 IST
అడవి నుంచి మిడ్నాపూర్ పట్టణంలోకి అడుగు పెట్టిన ఏనుగును అటవీశాఖ అధికారులు కాపాడి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించిన ఘటన...

మిడ్నాపూర్ (పశ్చిమబెంగాల్): అడవి నుంచి మిడ్నాపూర్ పట్టణంలోకి అడుగు పెట్టిన ఏనుగును అటవీశాఖ అధికారులు కాపాడి సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించిన ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మిడ్నాపూర్ పట్టణంలో గురువారం రాత్రి జరిగింది. అడవుల నుంచి వచ్చిన ఓ ఏనుగు గురువారం రాత్రి మిడ్నాపూర్ పట్టణంలోని వైద్యకళాశాల ఆసుపత్రి ప్రాంగణంలోకి వచ్చింది. దీంతో ఏనుగును చూసేందుకు పెద్దసంఖ్యలో పట్టణ ప్రజలు తరలివచ్చారు. ప్రజలను చూసి ఏనుగు బెదిరిపోకుండా నివారించేందుకు అటవీశాఖ అధికారులు పోలీసులను ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించారు. అనంతరం అటవీశాఖ అధికారులు అడవి నుంచి పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని క్రేన్ సహాయంతో ట్రక్కులోకి ఎక్కించారు. ఏనుగును పట్టణం నుంచి అరబారి అటవీ ప్రాంతానికి తరలించారు. ఏనుగును పశువైద్యాధికారుల పరిశీలనలో ఉంచారు. ఏనుగును రెండు రోజుల పరిశీలన తర్వాత అడవుల్లోకి వదిలివేస్తామని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఏపీ సింగ్ చెప్పారు.