ఆ రెండు అంశాలపై చర్చ జరగాలి: రాకేశ్ తికాయత్
ABN , First Publish Date - 2021-12-01T02:58:08+05:30 IST
సాగు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఆందోళనను ఆపబోమని ప్రకటించిన భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ తికాయత్.. తాజాగా రెండు అంశాలపై ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్..
న్యూఢిల్లీ: సాగు చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఆందోళనను ఆపబోమని ప్రకటించిన భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ తికాయత్.. తాజాగా రెండు అంశాలపై ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఒకటి కనీస మద్దతు ధరపై కాగా మరొకటి సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన ఆందోళనలో మరణించిన రైతులపై అని తేల్చి చెప్పారు. దీనికి ఆయన తేదీని కూడా ప్రకటించారు. డిసెంబర్ 4న సంయుక్త కిసాన్ మోర్చా (రైతు సంఘాల ఐక్య వేదిక) ముందు ప్రభుత్వం ఈ అంశాలపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పూర్తి స్థాయిలో ఆమోదించే వరకు ఆందోళన ఆగదని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం తికాయత్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం కేవలం సాగు చట్టాల ఉపసంహరణపై మాత్రమే స్పష్టతనిచ్చింది. ఇంకా కనీస మద్దతు ధర గురించి ఏమీ చెప్పలేదు. రైతు ఆందోళనలో నల్ల చట్టాల రద్దుతో పాటు ఎంఎస్పీ కూడా ప్రధాన అంశంగా ఉంది. ఇక ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్న రైతుల్లో అనేక మంది చనిపోయారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డిసెంబర్ 4న మా ముందు (సంయుక్త కిసాన్ మోర్చా) కనీస మద్దతు ధరతో పాటు, రైతుల మరణాలపై ప్రభుత్వం నోరు విప్పాలి, సమాధానం చెప్పాలి’’ అని అన్నారు.