చార్‌ధామ్‌ దేవాలయాల్లో టెక్నాలజీని వాడొద్దని ఏ శాస్త్రం చెప్పింది : హైకోర్టు

ABN , First Publish Date - 2021-07-08T21:56:22+05:30 IST

చార్‌ధామ్ దేవాలయాల్లో పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని

చార్‌ధామ్‌ దేవాలయాల్లో టెక్నాలజీని వాడొద్దని ఏ శాస్త్రం చెప్పింది : హైకోర్టు

న్యూఢిల్లీ : చార్‌ధామ్ దేవాలయాల్లో పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని చెప్తున్న శాస్త్రాలేమిటో చెప్పాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కోరింది. భారత దేశం ప్రజాస్వామిక దేశమని, చట్టాల ద్వారా పరిపాలన జరుగుతోందని, శాస్త్రాల ద్వారా కాదని తెలిపింది. దేవాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయరాదని చెప్పే నిబంధనలేమైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో ఉన్నాయేమో చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను కోరింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మ ధర్మాసనం ఈ వివరణ కోరింది. 


చార్‌ధామ్ యాత్రను నిలిపేస్తూ ఇటీవల ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరింది. దీనిపై అడ్వకేట్ జనరల్ ఎస్ఎన్ బబుల్కర్ స్పందిస్తూ, దేవాలయాల్లో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలకు శాస్త్రాలు అంగీకరించవేమోనని అన్నారు. దేవస్థానం బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు భారత దేశం ప్రజాస్వామిక దేశమని, చట్టాల ద్వారా పరిపాలన జరుగుతోందని, శాస్త్రాల ద్వారా కాదని తెలిపింది. దేవాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయరాదని చెప్పే నిబంధనలేమైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో ఉన్నాయేమో చెప్పాలని కోరింది. మతపరమైన వాదనల జోలికి వెళ్లొద్దని, వాటికి చట్టపరమైన మద్దతు లేదని వివరించింది. ప్రత్యక్ష ప్రసారం చేయరాదని, దానికి సంబంధించిన టెక్నాలజీని ఉపయోగించరాదని దేవస్థానం బోర్డు నిర్ణయిస్తే, ఏ శాస్త్రాలు ఆ విధంగా చెప్తున్నాయో తప్పనిసరిగా వివరించాలని కోరింది. తదుపరి విచారణ జూలై 28న జరుగుతుందని, బోర్డు నిర్ణయాన్ని ఆ రోజు తెలియజేయాలని తెలిపింది. 


చార్‌ధామ్ యాత్రకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీనిపై హైకోర్టు జూన్ 28న స్టే విధించింది.  బదరీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి, గంగోత్రి దేవాలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. 


Updated Date - 2021-07-08T21:56:22+05:30 IST