కొవిడ్ రోగుల్ని కాపాడేందుకు కొత్త రక్తపరీక్ష రూపొందించిన అమెరికా పరిశోధకులు
ABN , First Publish Date - 2021-01-17T08:08:58+05:30 IST
కొవిడ్ వైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన తొలిరోజు బాగానే ఉన్నప్పటికీ.. కొంతమంది రోగుల్లో ఒక్కసారిగా లక్షణాలు తీవ్రస్థాయికి చేరి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ
వాషింగ్టన్, జనవరి 16: కొవిడ్ వైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన తొలిరోజు బాగానే ఉన్నప్పటికీ.. కొంతమంది రోగుల్లో ఒక్కసారిగా లక్షణాలు తీవ్రస్థాయికి చేరి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ తరహా రోగుల్లో ప్రాణాపాయాన్ని ముందుగానే గుర్తించేందుకు ఒక కొత్త తరహా రక్త పరీక్షను రూపొందించారు అమెరికాలోని సెయింట్ లూయి్సలోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన పరిశోధకులు. జేసీఐ ఇన్సైట్ అనే జర్నల్లో వారు తమ పరిశోధన వివరాలను ప్రచురించారు.
‘‘మా అధ్యయనం కోసం 97మంది కొవిడ్ రోగుల్ని పరిశీలించాం. బతికి ఉన్న కొవిడ్ రోగులతో పోలిస్తే.. మృతుల్లో డీఎన్ఏ స్థాయులు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మైటోకాండ్రియల్ డీఎన్ఏ కణాల నుంచి బయటకు వచ్చి రక్తంలో కలిసిపోతుంటే.. కణాలు మృతిచెందుతున్నట్లు అర్థం. వైరస్ కారణంగా నెక్రోసిస్ అనే పరిస్థితి తలెత్తడం వలన కణాలు మైటోకాండ్రియల్ డీఎన్ఏను విడుదల చేసేస్తాయి. కొవిడ్ రోగుల్లో ఈ తరహా కణజాల నాశనం ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాల్లో గమనించాం.’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. తాము రూపొందించిన రక్త పరీక్ష ఫలితాలు కేవలం గంటలోపే వచ్చేస్తాయని వారు స్పష్టం చేశారు.