త్రిపుర కాంగ్రెస్ చీఫ్ కారుపై బీజేపీ కార్యకర్తల దాడి
ABN , First Publish Date - 2021-01-17T21:47:42+05:30 IST
త్రిపుర కాంగ్రెస్ చీప్ పీజూష్ బిశ్వాస్పై కారుపై బీజేపీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు దాడిచేశారు
అగర్తల: త్రిపుర కాంగ్రెస్ చీప్ పీజూష్ బిశ్వాస్ కారుపై బీజేపీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు ఈ ఉదయం దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడగా, స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ టీవీ చానల్తో ఆసుపత్రి నుంచి ఫోన్లో మాట్లాడిన బిశ్వాస్.. బిశాల్గఢ్లోని కాంగ్రెస్ ఫీల్డ్ ఆఫీస్ బయట పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. త్రిపుర రాజధాని అగర్తలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిశాల్గడ్లో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిశ్వాస్ కారులో వచ్చారు.
బీజేపీ కార్యకర్తల దాడిలో కారు ధ్వంసమైంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు దర్యాప్తు చేస్తున్నారని బిశ్వాస్ తెలిపారు. మరికాసేపట్లో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనుంది.