వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో విభేదాలు.. స్పందించిన టీఎంసీ

ABN , First Publish Date - 2021-12-24T02:15:51+05:30 IST

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో విభేదాలు పొడసూపాయంటూ వస్తున్న వార్తలపై తృణమూల్ కాంగ్రెస్

వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో విభేదాలు.. స్పందించిన టీఎంసీ

కోల్‌కతా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో విభేదాలు పొడసూపాయంటూ వస్తున్న వార్తలపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ఆ వార్తలు సత్య దూరమని, ప్రశాంత్ కిశోర్ ఐ-ప్యాక్‌‌కు, తమకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఉత్త వదంతులేనని కొట్టిపారేసింది. తామంతా ఒకే టీం అని స్పష్టం చేసింది.


టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రియన్ నిన్న చేసిన వ్యాఖ్యలతో ఈ రెండింటి మధ్య చెడిందన్న వార్తలు షికారు చేశాయి. ఎంపీ నిన్న మాట్లాడుతూ.. ఐ-ప్యాక్ తమకు సలహాదారు ఏజెన్సీ మాత్రమేనని, పార్టీ అభివృద్ధికి సలహాలు ఇచ్చేందుకు ఐదేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు. అంతేతప్ప, దాని అభిప్రాయాలతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. వారు తమ పని చేస్తే చాలని, తమ పార్టీ తరపున మాట్లాడకుంటే చాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐ-ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు.


దీనికి తోడు పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం, ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎదుగుతున్న తీరును ప్రశాంత్ కిశోర్ తన చలువగా ప్రచారం చేసుకుంటున్నారని, దీంతో మమత గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో పీకేకు, మమతకు మధ్య చెడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాజకీయ వర్గాల్లోనూ ఈ వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీఎంసీ ఇలా స్పందించింది.

Updated Date - 2021-12-24T02:15:51+05:30 IST