తమిళనాడు సీఎం పళనిస్వామి రాజీనామా.. ఆమోదించిన గవర్నర్..
ABN , First Publish Date - 2021-05-04T01:38:13+05:30 IST
తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి రాజీనామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కు తన రాజీనామా లేఖను సమర్పించారు...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి రాజీనామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇప్పటికే ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్భవన్ వెల్లడించింది. ‘‘ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి, ఆయన మంత్రి మండలి రాజీనామాలను తమిళనాడు గవర్నర్ ఆమోదించారు. 3.5.2021 మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చింది...’’ అని రాజ్భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ముఖ్యమంత్రి, మంత్రి మండలి కొనసాగాలని పళనిస్వామిని గవర్నర్ కోరినట్టు తెలిపింది. ‘‘తమిళనాడు 15వ శాసన సభను గవర్నర్ రద్దు చేశారు...’’ అని కూడా రాజ్భవన్ వెల్లడించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గానూ 133 స్థానాలు గెలుచుకున్న డీఎంకే.. అన్నాడీఎంకే నుంచి అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకేకి 66 స్థానాలు మాత్రమే దక్కాయి.