ముగ్గురు బాలలు.. 2 కోట్ల సాయం!

ABN , First Publish Date - 2021-05-05T07:54:27+05:30 IST

కరోనా కష్టకాలంలో ఉన్న భారతదేశానికి కొద్దిరోజుల క్రితం కెనడా ప్రకటించిన సాయం దాదాపుగా రూ.5 కోట్లు! కానీ.. 15 ఏళ్ల వయసున్న ముగ్గురు(ట్రిప్లెట్స్‌) ఆన్‌లైన్‌లో...

ముగ్గురు బాలలు.. 2 కోట్ల సాయం!

  • భారత్‌కు సాయం చేసేందుకు విరాళాల సేకరణ

వాషింగ్టన్‌, అహ్మదాబాద్‌, మే 4: కరోనా కష్టకాలంలో ఉన్న భారతదేశానికి కొద్దిరోజుల క్రితం కెనడా ప్రకటించిన సాయం దాదాపుగా రూ.5 కోట్లు! కానీ.. 15 ఏళ్ల వయసున్న ముగ్గురు(ట్రిప్లెట్స్‌) ఆన్‌లైన్‌లో విరాళాల రూపంలో అక్షరాలా రూ.2 కోట్లకు పైగా సేకరించి భారతదేశానికి ప్రాణవాయువు అందించడానికి ముందుకొచ్చారు. ఆ ముగ్గురూ.. జియా, కరీనా, అర్మాన్‌ గుప్తా. ‘లిటిల్‌ మెంటార్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వారు ఈ విరాళాలు సేకరించారు. ఈ సొమ్ముతో భారత్‌కు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు, వెంటిలేటర్లు పంపాలన్నది వారి ఆలోచన. అయితే.. ఈ పరికరాలను వాడుకునే పేషెంట్లు, వాటి అవసరం తీరిపోయాక తిరిగి ఇచ్చేయాలని, తద్వారా తదుపరి పేషెంట్లకు అవి ఉపయోగపడతాయని వారు అభ్యర్థిస్తున్నారు. అమెరికా నుంచి టీకా ముడిపదార్థాల ఎగుమతిపై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు.. ఈ ముగ్గురు బాలలూ పలువురు సెనెటర్లను, కాంగ్రెస్‌ సభ్యులను కలిసి ఆ ఆంక్షలు ఎత్తేయాల్సిందిగా అభ్యర్థించారు. కరోనా కష్టకాలంలో ఉన్న భారతదేశానికి పలుదేశాల నుంచి సాయం కొనసాగుతోంది. భారత్‌కు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.. 20 టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌తో కూడిన ఏడు ట్యాంకర్లను పంపింది. అలాగే.. మన వైమానిక దళానికి చెందిన విమానాలు యూకే నుంచి 450 ఖాళీ ఆక్సిజన్‌ సిలిండర్లు సహా 35 టన్నుల వైద్యపరిరాలను తీసుకొచ్చాయి. యూకే భారత్‌కు 5000 ఆక్సిజన్‌ సిలిండర్లను విరాళంగా ఇచ్చిందని రెడ్‌క్రాస్‌ సంస్థ తెలిపింది. ఆ 5000 సిలిండర్లలో 900 తమిళనాడుకు అని వెల్లడించింది.  


Updated Date - 2021-05-05T07:54:27+05:30 IST