చైనాలో మరోసారి.. కొవిడ్ లాక్డౌన్లో వేలాదిమంది
ABN , First Publish Date - 2021-10-26T22:09:33+05:30 IST
చైనాలో మరోసారి కఠిన లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉత్తర చైనా ఇన్నర్ మంగోలియా అటానమస్
బీజింగ్: చైనాలో మరోసారి కఠిన లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉత్తర చైనా ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో కరోనా కేసులు మళ్లీ పెరగడంతో అధికారులు లాక్డౌన్ విధించారు. చైనాలో గత వారం రోజుల్లో 150కిపైగా కేసులు వెలుగు చూడగా, వీటిలో దాదాపు మూడోవంతు కేసులు ఈ ప్రాంతంలోని అలగ్జా లెఫ్ట్ బ్యానర్లోనే నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 1.8 లక్షల మంది నివసిస్తున్నారు.
తాజా కేసుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎజిన్ బ్యానర్లోని 35,700 మంది ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఆంక్షలే ఎరెన్హాట్లోనూ ఉన్నాయి. ఆదేశాలను ఉల్లంఘించి బయటకు వస్తే సివిల్, క్రిమినల్ కేసులు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది.
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఎజిన్ బ్యానర్ ఆరోగ్య కమిషనర్ సహా ఆరుగురిపై ప్రభుత్వం వేటేసింది. కాగా, దేశంలో 2 బిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు ఈ ఏడాది ఆగస్టులో చైనా ప్రభుత్వం ప్రకటించింది.