ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా: గులాం నబీ ఆజాద్
ABN , First Publish Date - 2021-08-10T22:26:11+05:30 IST
జమ్మూకశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు ముందే పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని..
![ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా: గులాం నబీ ఆజాద్](https://media.andhrajyothy.com/appimg/galleries/1921081004505520/08102021165405n42.jpg)
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు ముందే పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. మంగళవారంనాడు శ్రీనగర్లో కాంగ్రెస్ కార్టీ కార్యాలయం ప్రారంభానికి వెళ్తూ మీడియాతో ఆయన మాట్లాడారు. జమ్మూకశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, కశ్మీరీ పండిట్లను వెనక్కు రప్పించడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించిన వెంటనే 370 అధికరణ రద్దుతో కోల్పోయిన ఆస్తులు, ఉద్యోగాలు తమకు వెనక్కి ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ విశ్వసనీయతను బీజేపీ ప్రశ్నించడంపై అడిగినప్పుడు, ఈ రెండు పార్టీల్లో ఎవరి విశ్వసనీయత ఎక్కువో ప్రజలందరికీ తెలుసునని ఆజాద్ సమాధానమిచ్చారు.
అనంతరం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి గులాబ్ నబీ ఆజాద్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్లో మన (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర సంక్షేమానికి 'ఉడాన్' వంటి ఎన్నో పథకాలను రాహుల్ గాంధీ ప్రవేశపెట్టారని, ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటంతో ఇక్కడి పరిస్థితులు మారిపోయాయని అన్నారు. కశ్మీర్లో 370వ అధికరణపై మాట్లాడుతూ, ప్రపంచంలోని ఏ రాష్ట్రానికి ఇలాంటి దుర్గతి పట్టలేదని అన్నారు. ఆయన తర్వాత ప్రసంగించిన రాహుల్ సైతం ఆజాద్ డిమాండ్ను బలపరిచారు. జమ్మూకశ్మీర్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.