కశ్మీరులో ఉగ్ర దాడి... ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టీచర్లు...
ABN , First Publish Date - 2021-10-07T23:39:14+05:30 IST
జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్లో సంగం ఈద్గా ప్రాంతంలో గురువారం
శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్లో సంగం ఈద్గా ప్రాంతంలో గురువారం ఉదయం ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కశ్మీరులో మైనారిటీ మతాలవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జమ్మూ-కశ్మీరు పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, గురువారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో శ్రీనగర్లోని సంగం ఈద్గా ఏరియాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి ఉగ్రవాదులు చొరబడి, కాల్పులు జరిపారని చెప్పారు. ఈ కాల్పుల్లో ప్రిన్సిపాల్ సుపుందర్ కౌర్, టీచర్ దీపక్ చంద్ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఉగ్రవాదుల కోసం గాలింపు జరుగుతోందని చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఈ పాఠశాలలో విద్యార్థులు లేరని, తరగతులు ఆన్లైన్లో జరుగుతున్నాయని తెలిపారు.
శ్రీనగర్, బందిపొరలలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ప్రముఖ ఫార్మసిస్ట్ మఖన్ లాల్ బింద్రూ కూడా ఉన్నారు. శ్రీనగర్ మేయర్ మాట్లాడుతూ, ఓ రోడ్డుకు బింద్రూ పేరు పెడతామని చెప్పారు.
కశ్మీరులోని మైనారిటీలపై ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీపక్ చంద్ ఓ హిందూ అని, సుపుందర్ కౌర్ ఓ సిక్కు అని ఆ పాఠశాలలోని ఓ టీచర్ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఉగ్రవాదులు ఈ పాఠశాలలోకి చొరబడి, అక్కడ ఉన్నవారి ఐడెంటిటీ కార్డులను అడిగారని, మైనారిటీలైన హిందూ, సిక్కు మతాలకు చెందినవారిని దారుణంగా కాల్చి చంపారని చెప్పారు.