టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్
ABN , First Publish Date - 2021-10-29T20:41:27+05:30 IST
ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ శుక్రవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ..
పనజి: ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ శుక్రవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీఎంసీలో లియాండర్ పేస్ చేరడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహం నిపింది. లియాండర్ పేస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని మమతా బెనర్జీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు. పేస్ తన చిన్నతమ్ముడు వంటివాడని, తాను యువజన శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన తనకు తెలుసునని, ఆయన చాలా చాలా యంగ్ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. పేస్ రాకను టీఎంసీ మరో ట్వీట్లో తెలియజేస్తూ, 2014 నుంచి ఎదురుచూస్తున్న ప్రజాస్వామ్య ఉషోదయాన్ని కలిసికట్టుగా సాధించేందుకు సమష్టి కృషి సల్పుతామని పేర్కొంది.
టీఎంసీలోకి నటుడు నఫిసా అలీ...
నటుడు నఫిసా అలి, మృణాళిని దేశ్ప్రభు సైతం గోవాలో జరిగిన కార్యక్రమంలో టీఎంసీ తీర్ధం తీసుకున్నారు. వారిని పార్టీలోకి మమతా బెనర్జీ సాదర స్వాగతం పలికారు. ఈనెల 24న పనజి, నవేలిమ్, సంగ్యూమ్లో జరిగిన కార్యక్రమాల్లో 300 మంది టీఎంసీలో చేరినట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఎంజీపీ, జీఎఫ్పీ, ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతుతో అధికారంలో ఉంది. కాంగ్రెస్కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.