Chennai: పొంచివున్న మరో గండం
ABN , First Publish Date - 2021-11-11T14:21:27+05:30 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కి.మీ పశ్చిమ వాయువ్య దిశలో కదిలి గురువారం సాయంత్రం కారైక్కాల్, శ్రీహరికోట మధ్య ఉత్తర సరిహద్దును
- నేడు తీరం దాటనున్న వాయుగుండం
- పుదుచ్చేరి - శ్రీహరికోట మధ్య అవకాశం
- 3 రోజులు భారీ వర్షసూచన
- ఆరు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’
చెన్నై(Tamilnadu): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కి.మీ పశ్చిమ వాయువ్య దిశలో కదిలి గురువారం సాయంత్రం కారైక్కాల్, శ్రీహరికోట మధ్య ఉత్తర సరిహద్దును దాటి పుదుచ్చేరిని చేరుకొనే అవకాశ ముండడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్త మైంది. అదే సమయంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా రూపుదిద్దుకుంటోందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ నెల 13న అండమాన్ సమీపంలో ఏర్పడే అల్పపీడనం కూడా వాయుగుండంగా మారే అవకాశం వుందని వారు పేర్కొన్నారు. దీనితో రెండు వాయుగుండాలు వరుసగా విరుచుకుపడి వర్షబీభత్సాన్ని సృష్టించనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం కేంద్రీకృతమైన అల్పపీడనం బుధవారం వాయుగుండంగా మారినట్టు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు ఆ వాయుగుండం దక్షిణ బంగాళాఖాతం నడుమ కేంద్రీకృతమైనట్టు వారు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆ వాయుగుండం మరింతగా బలపడి ఆగ్నేయ దిశగా కదులుతుందని, గురువారం సాయంత్రానికి కారెక్కాల్- శ్రీహరికోట మధ్య ఉత్తర సరిహద్దును దాటుతుందని వారు తెలిపారు. ఈ వాయుగుండం కారణంగా చెన్నై, విల్లుపురం, కడలూరు, శివగంగ, రామనాథపురం జిల్లాల్లో కారైక్కాల్ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురిశాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నాగపట్టినం, మైలాడుదురై, తిరువారూరు, తంజావూరు, కడలూరు, విల్లుపురం, పుదుకోట, శివగంగ, రామనాథపురం, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి వర్షాలు కురిశాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో చెన్నైతోపాటు తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియా కుమారి, తెన్కాశి, విరుదునగర్, మదురై, అరియలూరు, పెరంబలూరు, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీగా వర్షాలు కురవనున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, కళ్లకుర్చి జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయి. అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి, రామనాథపురం, పుదుకోట తదితర డెల్టా జిల్లాల్లో మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ శనివారం వరకు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 5100 శిబిరాలలో వర్షబాధితులు బసచేస్తున్నారు.కాగా చెన్నైలో బుధవారం రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది.
అండమాన్ వద్ద మరో అల్పపీడనం
అండమాన్ పరిసర ప్రాంతాల్లో వర్షపు మేఘాలు విపరీతంగా ఉన్నాయని, అవన్నీ కలిసి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. ఈనెల 13న ఏర్పడనున్న ఈ అల్పపీడనం కూడా వాయుగుండంగా మారి తీరం దాటనుందని, దీనితో చెన్నై పరిసర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడే అవకాశం కూడా వుందని వారు వివరించారు.
పెనుగాలులు...
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం సాయంత్రం తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 70 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈనెల 15 వరకు కడలిలో అలజడి అధికంగా ఉంటుందని, జాలర్లు చేపలవేటకు వెళ్ళరాదని, గురువారం ఉదయం 11 గంటలకు ఆ వాయుగుండం తీరాన్ని సమీపిస్తుందని తెలిపారు. సాయంత్రం తీరం దాటుతుందని వివరించారు.
స్వచ్ఛంద సంస్థలకు కార్పొరేషన్ పిలుపు
వర్షబాధిత ప్రాంతాల్లో తమ సిబ్బందితో పాటు సహాయక చర్యలు చేపట్టేందుకు ఆసక్తికలిగిన స్వచ్ఛంద సంస్థలు ముందుకురా వాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. వరదలలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జలదిగ్బంధంలో ఉన్నవారిని ప్లాస్టిక్ పడవలలో ఒడ్డుకు చేర్చడం, బాధితులకు ముప్పూటలా ఆహారం పంపిణీ చేయడం, రహదారుల్లో వాననీటిని తొలగించడం వంటి పనులను కార్పొరేషన్ సిబ్బందితో కలిసి చేయడానికి స్వచ్ఛంద సంస్థలు నడుంబిగించాలని పేర్కొంది. ఆసక్తిగల స్వచ్ఛంద సంస్థలు కార్పొరేషన్ ట్విట్టర్ పేజీలో పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపింది.